కేసీఆర్ స్ట్రాటజీ!: 'పథకం ప్రకారమే హైకోర్టు విభజన అంశం తెరపైకి'
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టును విభజించాలంటూ తెలంగాణకు చెందిన జడ్జిలు, లాయర్లు ఒక్కసారిగా రొడ్డెక్కడం వెనుక ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. గత కొన్ని రోజులుగా లాయర్లు హైకోర్టుని విభజించాలని నిరసన కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ, సోమవారం నుంచి ఆందోళనలు మరింత ఉధృతమైన సంగతి తెలిసిందే.
న్యాయవ్యవస్థ చరిత్రలోనే మొట్టమొదటిసారి పెద్దఎత్తున న్యాయాధికారులు సామూహికంగా రొడ్డెక్కడమే కాకుండా మౌన ప్రదర్శన చేశారు. దీంతో ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారంటూ తెలంగాణకు చెందిన మొత్తం 11 మంది న్యాయాధికారులపై సస్పెన్షన్ వేటు వేశారు.
ఏపీకి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలనే డిమాండ్తో తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం నిరసనగళం విప్పిన నేపథ్యంలో జడ్జిల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శలుగా ఉన్న ఇద్దరు న్యాయాధికారులను సస్సెండ్ చేస్తూ సోమవారం హైకోర్టు రిజిస్ట్రార్ (విజిలెన్స్) పేరిట ఉత్తర్వులు వెలువడిన సంగతి తెలిసిందే.
న్యాయాధికారుల సస్పెన్షన్పై న్యాయవాదులు, న్యాయాధికారులు నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళనకు సిద్దమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ సివిల్ సర్వీసు (క్లాసిఫికేషన్, కంట్రోల్ అండ్ అప్పీల్) రూల్స్ 1991 (సీసీఏ) ఉల్లంఘించారనే కారణంతో మంగళవారం మరో తొమ్మింది మందిపై సస్పెన్షన్ వేటు పడిన సంగతి తెలిసిందే.
హైకోర్టు పరిధిలో జరుగుతున్న పరిణామాలపై ఏసీజే నేతృత్వంలోని న్యాయధికారులు మంగళవారం ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. ఉమ్మడి హైకోర్టు విభజన అంశం రాష్ట్రం పరిధిలోని కాదని, కేంద్రంలో పరిధిలో ఉందని తెలిసి కూడా న్యాయాధికారులు ఒక్కసారిగా ఆందోళనలకు దిగడం వెనుక టీఆర్ఎస్ ప్రభుత్వం హస్తం ఉందని బీజేపీ నేతలు ఆరోపించారు.
గత కొన్ని రోజులుగా మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు న్యాయం చేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని విపక్షాలు మండిపడుతున్న సంగతి తెలిసిందే. హైకోర్టు విభజన కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో దీక్ష చేపట్టనున్నట్లు మీడియాలో వార్తలు రావడంతో మల్లన్న సాగర్ అంశం పక్కకు వెళ్లి ఉమ్మడి హైకోర్టు విభజన అంశం తెరపైకి వచ్చింది.
హైకోర్టు విభజన గురించి టీఆర్ఎస్ నేతలు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అయితే మల్లన్న సాగర్ అంశాన్ని పక్కదారి పట్టించడానికే కేసీఆర్ హైకోర్టు విభజన తెరమీదికి తీసుకువచ్చారని బీజేపీ నేత రఘునందన్ రావు విమర్శించారు.
బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే, మల్లన్న సాగర్ రైతులు రోడ్డుపైకి వస్తే కేసీఆర్కి మనస్తాపం కలగలేదా? అని ప్రశ్నించారు. ఈ మల్లన్న సాగర్ అంశంపై ఎంపీ కవిత సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
హైదరాబాద్లోని కార్పొరేటర్స్కి ఆప్షన్స్ ఇవ్వవచ్చు కానీ, 50 మంది న్యాయమూర్తులకు ఇస్తే తప్పు ఏంటని ఆయన ప్రశ్నించారు. హైకోర్టు విభజన విషయంపై కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ స్పందించారని, హైకోర్టు విభజన విషయంలో ఇద్దరు సీఎంలు మాట్లాడుకుంటే పరిష్కారం అవుతుందన్నారు.
ఉమ్మడి హైకోర్టు విభజన కోసం ఢిల్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ దీక్ష ఎప్పుడు చేస్తారో చెప్పాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 123 జీఓ మంచిదా లేక 2013 చట్టం మంచిదా అనే విషయంపై మంత్రి హరీష్ రావు బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.