టీ సభలో గందరగోళం: కిషన్ సహా బీజేపీ సభ్యుల సస్పెన్షన్, జానా రెడ్డి వాకౌట్
తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం చోటు చేసుకుంది. మతపరమైన రిజర్వేషన్లు వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ సభ్యులు ఆందోళన చేపట్టారు. దీంతో మంత్రి హరీశ్ రావు బీజేపీ సభ్యులపై సస్పెన్షన్కు సూచనలు చేశారు. ఈ మేరకు
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం చోటు చేసుకుంది. మతపరమైన రిజర్వేషన్లు వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ సభ్యులు ఆందోళన చేపట్టారు. దీంతో మంత్రి హరీశ్ రావు బీజేపీ సభ్యులపై సస్పెన్షన్కు సూచనలు చేశారు. ఈ మేరకు స్పీకర్ మధుసూదనాచారి వారిపై సస్పెన్షన్ వేటు వేశారు.
బీజేపీ సభ్యులు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, రాజాసింగ్, ప్రభాకర్, రాంచంద్రారెడ్డిలపై 2రోజులపాటు సస్పెన్షన్ విధించినట్లు మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. బీజేపీ సభ్యులపై సస్పెన్షన్ విధించడంపై సీనియర్ ఎమ్మెల్యే జానారెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు.
ప్రభుత్వం అణచివేత దోరణితో వ్యవహరించడం సరికాదని అన్నారు. సభ్యులకు సమాధానపర్చాలే కానీ, సస్పెండ్ చేయడం మంచి పద్ధతి కాదని అన్నారు. బీజేపీ సభ్యుల సస్పెన్షన్ వేటుకు నిరసనగా కాంగ్రెస్ వాకౌట్ చేస్తోందని తమ సభ్యులతోపాటు సభ నుంచి వెళ్లిపోయారు.
బీజేపీ కార్యకర్తలను ఎందుకు అరెస్ట్ చేశారని అంతకుముందు జానా రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ ఉంటే అసెంబ్లీ వరకు వారు వచ్చేవారు కాదు కదా.. అని జానా రెడ్డి అన్నారు. ధర్నా చౌక్ను ఇందిరా పార్క్ వద్దే కొనసాగించాలని జానా రెడ్డి డిమాండ్ చేశారు.