పొలిటికల్ పంచ్: ఒక్కసారికే కెసిఆర్ కు భయం, ఒకే విమానంలో వెళ్ళినా టిడిపికి బిజెపి షాక్
బిజెపి, టిఆర్ఎస్ నాయకుల మధ్య మాటల యుద్దం సాగుతోంది. అమిత్ షా తెలంగాణ ప్రజలను కించపర్చేలా మాట్లాడినందుకు గాను క్షమాపణ చెప్పాలని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ డిమాండ్ చేశారు.అయితే బిజెపి నాయకులు కూడ కెసిఆ
హైదరాబాద్: బిజెపి, టిఆర్ఎస్ నాయకుల మధ్య మాటల యుద్దం సాగుతోంది. అమిత్ షా తెలంగాణ ప్రజలను కించపర్చేలా మాట్లాడినందుకు గాను క్షమాపణ చెప్పాలని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ డిమాండ్ చేశారు.అయితే బిజెపి నాయకులు కూడ కెసిఆర్ కు ధీటుగానే కౌంటర్ ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజుల పాటు బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటించారు.అయితే తెలంగాణ రాష్ట్రానికి వెయ్యి కోట్లకు పైగా నిధులను ఇచ్చినట్టు ఆయన ప్రకటించారు.అయితే ఈ ప్రకటనపై కెసిఆర్ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు.
బిజెపి నాయకులు తెలంగాణ ప్రజలను కించపర్చేలా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు.అయితే ఈ విషయమై బిజెపి నాయకులు కూడ తగ్గలేదు. తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని అమిత్ షా ప్రకటించారు.గురువారం నాడు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ హైద్రాబాద్ లో కెసిఆర్ పై నిప్పులు చెరిగారు.అయితే తెలంగాణ సిఎం కెసిఆర్ రాజీనామాకు సిద్దంగా ఉండాలని బిజెపి నేతలు సవాల్ విసిరారు. తాము చెప్పిన మాటలకు కట్టుబడి ఉన్నామన్నారు.
ఒక్కసారికే కెసిఆర్ భయంపట్టుకొంది
తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారే బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటించారని, ఈ ఒక్కసారి పర్యటనతోనే కెసిఆర్ కాళ్ళ కింద భూమి కుంగిపోతోందని చెప్పారు.అమిత్ షా టూర్ కారణంగా కెసిఆర్ అసహనానికి గురయ్యారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ ఆరోపించారు.ఈ ఏడాది సెప్టెంబర్ లో మరోసారి అమిత్ షా రాష్ట్రంలో పర్యటించనున్నారని లక్ష్మణ్ చెప్పారు. దళితుల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు ప్రయత్నించినట్టు చెప్పారు.దళితుల పేరు చెప్పి నాటకాలు ఆడిన చరిత్ర కెసిఆర్ కే ఉందని లక్ష్మణ్ విమర్శించారు.
కేంద్రం నిధులున్నాయి
రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రతి పథకంలో కేంద్రం వాటాలున్నాయని లక్ష్మణ్ చెప్పారు. ఇదే విషయాన్ని అమిత్ షా తన పర్యటనలో చెప్పారని ఆయన గుర్తు చేశారు. కాని, మాటలతో ప్రజలను మభ్యపెట్టేందుకు కెసిఆర్ ప్రయత్నిస్తున్నాడని ఆయన ఆరోపించారు. అమిత్ షా వాడిన అభ్యంతరకర పదజాలంపై లక్ష్మణ్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. రూపాయికి కిలో బియ్యం పథకంలో కేంద్రం రూ.27 చెల్లిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం రూ.2 మాత్రమే చెల్లిస్తూ కేంద్రాన్ని విమర్శిస్తోందని ఆయన తప్పుబట్టారు. కేంద్రం 90 వేల ఇళ్ళను కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వినియోగించుకోలేదన్నారు.ఆసుపత్రులకు వెయ్యి కోట్లు ఇస్తే రాష్ట్రం వాటా రూ.250 కోట్లు ఇవ్వలేకపోయారని ఆయన గుర్తు చేశారు.
ఒకే విమానంలో విజయవాడకు బాబు, అమిత్ షా
గురువారం ఉదయం పూట బేగంపేట విమానాశ్రయం నుండి బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడులు విజయవాడకు బయలుదేరివెళ్ళారు. విజయవాడలో పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకుగాను అమిత్ షా విజయవాడ వెళ్ళారు. తెలంగాణలో మహనాడులో పాల్గొనేందుకు చంద్రబాబునాయుడు బుదవారం సాయంత్రం హైద్రాబాద్ కు వచ్చారు.వీరిద్దరూ కలిసి ఒకే విమానంలో ప్రయాణించారు.ఈ సమయంలో రెండు తెలుగురాష్ట్రాల్లో నెలకొన్న రాజకీయపరిస్థితులపై చర్చించారు.
టిడిపి పై బిజెపి నేతల ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి పై ఏపీ బిజెపి నేతలు ఫిర్యాదుచేశారు. కేంద్రం నుండి ఆంధ్రప్రదేశ్ కు ఎన్ని నిధులు వచ్చినా ఆశించినా ఆ మేరకు పార్టీకి ప్రయోజనం కలగడం లేదని బిజెపి నాయకులు అమిత్ షా కు ఫిర్యాదు చేశారు. రెండు పార్టీల మధ్య నెలకొన్న సమన్వయసమస్యలపై చంద్రబాబునాయుడు, బిజెపి నాయకులు చర్చించనున్నారు.
రాజీనామాకు కెసిఆర్ సిద్దంగా ఉండాలి
తెలంగాణకు కేంద్రం నుండి వచ్చిన ప్రతి పైసా వివరాలను చెబుతామని బిజెపి నాయకులు లక్ష్మణ్ , కిషన్ రెడ్డిలు ప్రకటించారు. ఈ విషయమై ఎక్కడైనా చర్చకు తాము సిద్దమేనన్నారు.కేంద్రం తెలంగాణకు లక్ష కోట్లకు పైగానే నిధులను ఇచ్చిందన్నారు. కేంద్ర నిధులపై ఖచ్చితమైన లెక్కలను ప్రజలముందుంతామని వారు ప్రకటించారు.అయితే కెసిఆర్ రాజీనామాకు సిద్దంగా ఉండాలని వారు సవాల్ విసిరారు.