అన్ని రాష్ట్రాల్లో బిజెపి జెండా, ఉద్యోగాల కోసం వెతక్కండి: రామ్ మాధవ్
రానున్న కాలంలో బిజెపి దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తుందని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ అన్నారు. ఇందుకోసం పార్టీ శ్రేణులు కృషి చేయాలన్నారు.
వరంగల్: రానున్న కాలంలో బిజెపి దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తుందని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ అన్నారు. ఇందుకోసం పార్టీ శ్రేణులు కృషి చేయాలన్నారు.
ఆయన ఆదివారం వరంగల్లోని నందన గార్డెన్లో జరిగిన బిజెపి కార్యవర్గ సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. పేదవారికి కూడా బ్యాంక్ అకౌంట్ ఉండాలని జన్ ధన్ యోజనను కేంద్రం తీసుకు వచ్చిందన్నారు.
నోట్ల రద్దు, జిఎస్టీ తదితర వాటిని తీసుకు వచ్చి అవినీతిని తగ్గించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేసిందన్నారు. స్టార్టప్, మేకిన్ ఇండియా ప్రోగ్రాంలతో ప్రధాని మోడీ భారత్ను సరికొత్త భారత దేశంగా మార్చుతున్నారన్నారు.
నవ భారత్ నిర్మించేందుకు అన్ని విభాగాల్లో సాంకేతికతను పరిచయం చేస్తున్నట్లు చెప్పారు. దీని వల్ల యువతలో ఎంటర్ప్రెన్యూర్షిప్కు దోహదపడుతోందన్నారు.
ఈ సందర్భంగా రామ్ మాధవ్ యువతకు ఓ పిలుపును ఇచ్చారు. మీరు ఉద్యోగం కోసం చూడకండి... ఉద్యోగాలు సృష్టించండి అని చెప్పారు. నవ భారత్ను నిర్మించేందుకు యువత ముందుకు రావాలన్నారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సంస్కరణల ఫలితం అందేలా చూసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు.
కార్యకర్తలు గ్రామాల్లోకి వెళ్లి ప్రజలను కలవాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వచ్చేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని రామ్ మాధవ్ పిలుపునిచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేయాలంటూ దిశానిర్దేశం చేశారు. బిజెపి నాయకుల పార్టీ కాదని కార్యకర్తల పార్టీ అని చెప్పారు.
నవ భారతావని నిర్మాణానికి ప్రధాని మోడీ చేస్తున్న కృషిలో అంతా భాగస్వామ్యులవ్వాలని కోరారు. బిజెపి అధికారంలోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికే అన్నారు. మూడు సంవత్సరాలుగా అవినీతిపై ప్రత్యక్షంగా పరోక్షంగా పోరాటం చేస్తున్నామన్నారు.
అవినీతిని పై స్ధాయి నుంచి అంతంమొందించాలన్నారు. బిజెపి అదే చేస్తోందన్నారు. అవినీతిరహిత, స్వచ్ఛ భారత్ను భవిష్యత్ తరాలకు అందించాలన్నదే మోడీ తపన అన్నారు.
సాధారణంగా అధికారంలో ఉంటే ప్రజాదరణ తగ్గుతుందని కానీ ఇందుకు భిన్నంగా మోడీకి రోజు రోజుకీ ప్రజాదరణ పెరుగుతోందని చెప్పారు. దేశంలో ఆఖరి మనిషి జీవితంలోనూ మార్పు తీసుకురావడానికే మోడీ కృషి చేస్తున్నారన్నారు.
అంతకుముందు బిజెపి తెలంగాణ అధ్యక్షులు లక్ష్మణ్ మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు పాలన సాగడం లేదన్నారు. ప్రజల ఆశలను నీరుగార్చిందన్నారు. డ్రగ్స్ కల్చర్ వంటి అంశాలను హఠాత్తుగా తెరపైకి తీసుకు వచ్చి పాలనలోని తప్పులు కనిపించకుండా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. నయీం కేసు, మియాపూర్ భూ స్కాం.. ఇలా పలు అంశాలు కొలిక్కి రాలేదన్నారు.
సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కేంద్రమంత్రి హన్స్రాజ్ అహిర్ అన్నారు.
ఉద్యమం సమయంలో కేసీఆర్ దీని కోసం డిమాండ్ చేసి, ఇప్పుడు దానిని నెరవేర్చడం లేదన్నారు. మజ్లిస్ను సంతృప్తి పరిచేందుకే ఆయన లిబరేషన్ డేను అధికారికంగా నిర్వహించడం లేదన్నారు.