పది వేల కోట్ల హైదరాబాద్ ఆసామి: వెనక గ్యాంగ్, బార్కాస్ బాబా బురిడీ
ఐడిఎస్ కింద పది వేల కోట్ల రూపాయలను ప్రకటించిన వ్యాపారి బానారాపు లక్ష్మణరావు గుట్టు రట్టయింది. ఆయన వెనక హవాలా హస్తం ఉన్నట్లు తేలింది. అతను బార్కాస్ బాబా మాయలో పడినట్లు కూడా తేలింది.
హైదరాబాద్: ఆదాయ వెల్లడి పథకం (ఐడిఎస్) కింద రూ.9,800 కోట్లను ప్రకటించిన బీఎల్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ యజమాని బానాపురం లక్ష్మణ్రావు గుట్టు రట్టయింది. అతని కోసం వేట సాగించిన ఆదాయం పన్ను అధికారులు దిమ్మ తిరిగే విషయాలను గుర్తించారు.
అతని వెనుక హవాలా గ్యాంగ్ హస్తం ఉన్నదని తెలుస్తోంది. రైస్పుల్లింగ్ కాయిన్ల ప్రయోగం పేరుతో బార్కాస్కు చెందిన బాబా గ్యాంగ్ ఈ మోసానికి పాల్పడినట్టు చెబుతున్నారు. బానాపురం లక్ష్మణ్రావు కేసులో ఆదాయం పన్ను శాఖ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. పెద్దమొత్తంలో ఆదాయాన్ని ప్రకటించడం వెనుక బార్కాస్ బాబాగా పేరుమోసిన షౌకత్అలీ ఉన్నట్టు అధికారుల విచారణలో వెల్లడైంది.
రైస్పుల్లింగ్ కాయిన్ల దందాలో వేలకోట్లు వస్తాయని చెప్పి బాబా గ్యాంగ్ లక్ష్మణ్రావును నమ్మించి కొంత సొమ్ము చేసుకున్నట్టు తెలుస్తోంది. బాబా కోసం పోలీసుల సహాయంతో వేట ప్రారంభించారు. పదివేల కోట్ల ఆదాయం ఉందని ప్రకటించిన లక్ష్మణ్రావుకు ఆస్తులకంటే నాలుగింతల అప్పులున్నాయని ఐటీ అధికారుల విచారణలో తెలిసింది.
బాబా మనుషుల మోసాన్ని తెలుసుకోలేకపోయిన లక్ష్మణ రావు చిక్కుల్లో పడ్డాడు. లక్ష్మణ్రావు ఆదాయ వెల్లడి పథకం కింద రూ.9,800కోట్లు ప్రకటించాడు. తాను ఒక ఆడిటర్కు రెండు వేల కోట్ల రూపాయలిచ్చినట్టు పేర్కొని ఆదాయం పన్ను శాఖ అధికారులను తప్పుదోవ పట్టించాడు. కానీ గడువు సమీపించగానే అసలు గుట్టురట్టయింది.
నవంబర్ గడిచిపోవడంతో ఐటీ అధికారులు రంగంలోకి దిగారు. వాస్తవానికి ఈ పథకం కింద పెనాల్టీ, సర్చార్జ్తో పాటు మొత్తంగా 4,500 కోట్లు చెల్లించాల్సి ఉంది. మొదటి దశలో రూ.1,125 కోట్ల పన్ను చెల్లించాలి. వచ్చే ఏడాది నవంబర్ నాటికి మొత్తం చెల్లించాల్సి ఉండింది. మొదటి వాయిదా చెల్లించకపోవడంతో ఐటీ అధికారులు రంగంలోకి దిగడంతో అసలు విషయం బయటకు వచ్చింది.
పదివేల కోట్ల డబ్బులు ఏమయ్యాయని లక్ష్మణ్రావు షౌకత్అలీని అడిగితే తాను మహారాష్ట్ర నాసిక్లో ఉన్నానని, మూడు ట్రక్కులలో నగదును పంపుతున్నానని అని చెప్పాడు. పలుసార్లు పోలీసుల నిఘా ఉందని దాట వేశాడు.
షౌకత్అలీ దీని వెనుక ప్రధాన సూత్రధారి అని స్పష్టం చేస్తున్నారు. బాబాను ఫోన్లో సంప్రదించగా గొంతు మార్చి మాట్లాడుతున్నాడని, ఒకసారి నాసిక్లో ఉన్నట్టు, మరోసారి కర్ణాటకలో ఉన్నట్టు చెప్తున్నాడని అధికారులు తెలిపారు. ఇన్కంటాక్స్ ఇన్వెస్టిగేషన్ విభాగం ప్రిన్సిపల్ డైరెక్టర్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో అన్ని కోణాలలో దర్యాప్తు జరుగుతోంది.
లక్ష్మణరావు ఇళ్లలో సోదాలు
ఇన్కమ్టాక్స్ ఇన్వెస్టిగేషన్ టీమ్ బుధవారం బంజారాహిల్స్ ఫిల్మ్నగర్లోని లక్ష్మణ్రావు ఇంటితోపాటు ఆయనకు చెందిన రెండు ఫ్లాట్లలో సోదాలు జరిపింది. ఆర్టీసీ క్రాస్రోడ్స్లోని ఆయన ఆడిటర్ లక్ష్మీనారాయణ ఇంట్లో తనిఖీలు జరిపారు. కానీ ఆ ఆడిటర్కు ఏటా రూ.10 లక్షల లోపే ఆదాయం ఉన్నట్టు అధికారులు కనుగొన్నారు.
బార్కాస్ బాబాదే కథ
హవాలా గ్యాంగ్లీడర్ బాబా షౌకత్ అలీ దీని వెనుక ప్రధాన సూత్రధారిగా, వెంకటేశ్వరరావు, రామ్మోహన్ అనే వ్యక్తులను పాత్రధారులుగా గుర్తించారు. వీరి వెనుక కర్ణాటకకు చెందిన ఒక బాబా కూడా ఉన్నట్టు తెలుస్తోంది.. బుధవారం రాత్రి ఆదాయం పన్ను శాఖ అధికారులు పోలీసుల సహాయంతో బార్కాస్లోని బాబా షౌకత్అలీ ఇంట్లో సోదాలు జరిపారు. కొంత నగదును ఇతర పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. రైస్పుల్లింగ్ కాయిన్ల దందా కోసం కొంత ఖర్చవుతుందని లక్ష్మణ్రావు దగ్గర బాబా భారీ మొత్తంలో డబ్బు వసూలు చేసినట్టు ఐటీ అధికారులు పరిశోధనలో వెల్లడైంది.
లక్ష్మణరావుపై కేసు నమోదు
ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించినందుకు లక్ష్మణరావుపై ఐటీ చట్టం కింద కేసు నమోదు చేయనున్నట్టు అధికారులు తెలిపారు. అప్పులే ఎక్కువ ఉన్న లక్ష్మణ్రావు మరి ఎందుకు అంత భారీ మొత్తం ఆదాయాన్ని ప్రకటించాడనేది అంతుపట్టకుండా ఉంది. అధికారులు జరిపిన పరిశోధనలో చాలా ఆసక్తి కరమైన విషయాలు వెల్లడయ్యాయి.
అన్నీ ఉత్తుత్తి కంపెనీలే..
లక్ష్మణారావు ఉత్తుత్తి కంపెనీలను స్థాపించినట్లు ఐటి అధికారులు గుర్తించారు. హైదరాబాద్ శివార్లలోని దేవరయాంజాల గ్రామానికి చెందిన బానాపూర్ లక్ష్మణ్రావు ఈసీఐఎల్ కంపెనీలో డిప్యూటీ జనరల్ మేనేజర్గా పనిచేశారు. 2011లో పదవీవిరమణ పొందిన ఆయన ఏడాదిలోనే ఉన్నట్టుండి బంజారాహిల్స్లో విశాలమైన భవనంతో పాటు తార్నాకలో రెండు ఫ్లాట్లను కొనుగోలు చేశారు. గతంలో ఆత్మహత్య చేసుకున్న చార్మినార్ కో-ఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ ఆగాఖాన్కు చెందిన బంజారాహిల్స్లోని ఇంటిని దాదాపు రూ.4 కోట్లకు కొన్నారు.
కొన్న ఇంటిపై అప్పులే...
లక్ష్మణరావు కొనుగోలు ఇంటిపై సుమారు రూ.6 కోట్ల వరకు అప్పులున్నాయి. ఆ ఇళ్లు ప్రమోద్ బానాపురం, రమాదేవి బానాపురం, లక్ష్మణ్రావు బానాపురం, వెంకటసంతోష్ బానాపురం పేరిట ఉన్నాయి. బీఎల్ఆర్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్, బీఎల్ఆర్ పవర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, బీఎల్ఆర్ ఇన్ఫో ప్రైవేట్ లిమిటెడ్, బీఎల్ఆర్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, బీఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, బీఎల్ఆర్ బయో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఇలా ఏడు కంపెనీలను రిజిస్టర్ చేయించారు. ఇవి ఆయన భార్య రమాదేవి పేరిట ఉన్నాయి. కార్పొరేట్ కంపెనీలుగా నమోదైనప్పటికీ వాటిలో ఎటువంటి కార్యకలాపాలు, లావాదేవీలు జరుగలేదని సమాచారం. పలు కంపెనీలున్న లక్ష్మణ్రావును జూన్నెలలో హైదరాబాద్ పాతబస్తీకి చెందిన బాబా సంప్రదించినట్టు తెలుస్తోంది.
ఏం చేయాలో తెలియక అతన్ని...
తమకు ఇరీడియంతో తయారు చేసిన రైస్పుల్లింగ్ కాయిన్ దందా ఉందని, దేశ విదేశాల నుంచి తమకు వేల కోట్లు అడ్డదారిలో వస్తాయని బాబా మనుషులు చెప్పారు. వాటిని ఎక్కడ దాచాలో తెలియడం లేదని, ఏ ఖాతాలోనో వేసే బదులు నీ కంపెనీల ఖాతాలలోనే వేస్తామని చెప్పారు. పన్ను కట్టిన తర్వాత మనం ఈ డబ్బును వాడుకోవచ్చని లక్ష్మణ్రావు ఆశపడ్డాడు. కేంద్రం ప్రవేశపెట్టిన ఆదాయ వెల్లడి పథకంలో పదివేల కోట్ల ఆదాయాన్ని ప్రకటించాలని సూచించారు. ఈ క్రమంలో లక్ష్మణ్రావు పలుచోట్ల అస్తులను కూడా భారీగానే కొన్నట్టు తెలిసింది. రంగారెడ్డి జిల్లా యాలాలలో రూ.111 కోట్లతో ఓ విత్తన కంపెనీని కొనుగోలు చేసేందుకు ఒప్పందం కూడా చేసుకున్నట్టు తెలుస్తోంది. అందుకు గాను అడ్వాన్స్గా రూ.9కోట్లకు చెక్కు కూడా ఇచ్చాడు. సీన్ రివర్స్ కావడంతో ఆ చెక్కు బౌన్స్ అయింది. ఈ క్రమంలో ఆయన తాజాగా మరో 46 కోట్ల అప్పు కూడా చేశాడు. వేలకోట్ల నగదు రాకపోగా అప్పుల పాలయ్యాడు.