బాబుకు టీటీడీపీ భారీ షాక్: కాంగ్రెస్లోకి కీలక నేత బోడ జనార్ధన్
తెలంగాణ తెలుగుదేశం పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. మంచిర్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నేత బోడ జనార్దన్ కాంగ్రెస్లో చేరనున్నారు.
మంచిర్యాల: తెలంగాణ తెలుగుదేశం పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. మంచిర్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నేత బోడ జనార్దన్ కాంగ్రెస్లో చేరనున్నారు. జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉండటం, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినా గెలిచే పరిస్థితులు కనిపించకపోవడంతోనే ఆయన పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
చర్చనీయాంశంగా బోడ నిర్ణయం
కొంతకాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్న బోడ జనార్దన్, తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవడం చర్చనీయాంశంగా మారింది. ఇన్నాళ్లూ తన వెంట ఉన్న టీడీపీ కార్యకర్తలు, నాయకులు, సన్నిహితులతో తాజాగా మంతనాలు సాగించినట్లు తెలిసింది.
ఆహ్వానాలు.. అదే లక్ష్యం..
కొంతకాలంగా మాజీ ఎమ్మెల్యే అరవిందరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్రావు తదితరులు బోడ జనార్దన్ను కాంగ్రెస్లోకి రావాలని ఆహ్వానిస్తున్నట్లు తెలిసింది.
రానున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి జిల్లాలో కాంగ్రెస్ను పటిష్ఠం చేయడం, టీఆర్ఎస్కు గట్టి పోటీ ఇవ్వడం ద్వారా శాసనసభ స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ నుంచి హామీ
కాంగ్రెస్లో చేరితే చెన్నూర్ అసెంబ్లీ స్థానం నుంచి టికెట్ ఇచ్చేందుకు ఆ పార్టీ అధిష్ఠానం అంగీకరించినట్లు తెలిసింది. ఆయన అనుచరులు కూడా ఇందుకు సుముఖత వ్యక్తం చేయడంతో త్వరలోనే ఆయన హస్తం పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకుంటున్నారు. ఇప్పటికే జైపూర్, కోటపల్లి, వేమనపల్లి, మందమర్రి మండలాల నుంచి పలువురు ఎంపీటీసీలు, సర్పంచులు బోడ జనార్దన్తో కలిసి కాంగ్రెస్లోకి వస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం.
కాంగ్రెస్ కలిసి వచ్చే అంశమే..
బోడ జనార్దన్ గతంలో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది, మంత్రిగా కూడా పనిచేశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండటం కాంగ్రెస్కు కలిసివచ్చే అంశం. బోడ జనార్దన్ గతంలోనూ కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రయత్నం చేశారు. టీఆర్ఎస్లోకి కూడా వెళ్లినట్లే వెళ్లి తిరిగి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ మంచిర్యాల జిల్లా (తూర్పు) అధ్యక్షునిగా కొనసాగారు. అనంతరం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, తిరిగి టీడీపీలో చేరారు.
టీడీపీకి భారీ దెబ్బే..
ప్రస్తుత పరిస్థితుల్లో టీఆర్ఎస్కు ప్రధానపోటీ ఇచ్చేది కాంగ్రెస్సేనని బోడ భావిస్తున్నట్లు తెలిసింది. టీఆర్ఎస్లో ఇప్పటికే ఆశావాహులు ఎక్కువగా ఉండటం, సిట్టింగ్ ఎమ్మెల్యేకు మళ్లీ అవకాశం కల్పిస్తారనే ప్రచారం జరుగుతుండటంతో ఆ పార్టీ గురించి ఆలోచించే పరిస్థితి లేకుండా పోయింది. తెలంగాణ టీడీపీలో కీలక నేతగా ఉన్న బోడా జనార్థన్ రెడ్డి ఆ పార్టీని వీడితే పెద్ద లోటే ఏర్పడనుంది. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని చూస్తున్న ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు ఇది పెద్ద షాకేనని చెప్పవచ్చు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆ పార్టీకి జిల్లాలో మరింత బలం చేకూరినట్లవుతుంది. అయితే, కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు చేరతారనే విషయం తేలాల్సివుంది.