ప్రభుత్వ కార్యాలయంలో చిత్తుగా తాగేశారు, చిందులేశారు (పిక్చర్స్)
హైదరాబాద్: హైదరాబాదులోని అంబర్పేట మండల కార్యాలయంలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది మద్యం పారించారు. ఆదివారం సెలవు దినం కావడంతో కార్యాలయంలోనే వారు విందు చేసుకుని, చిత్తుగా మద్యం తాగి చిందేశారు. మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం - అంబర్పేట మండల కార్యాలయంలో అటెండర్గా పనిచేసిన ఓ మహిళ ఇటీవల సైదాబాద్ మండలానికి బదిలీ అయింది.
ఆ సందర్భంగా ఆమె ఆదివారం మండల కార్యాలయ ఆవరణంలో రెవెన్యూ అధికారులు, సిబ్బందికి విందు ఇచ్చింది. దీనికి తహసీల్దార్ బాలశంకర్, ఆర్ఐలు చిరంజీవి, గిరి, భాస్కర్, వీఆర్ఓలు విజయ్, మనోహర్, అవుట్సోర్కింగ్ సిబ్బంది శ్రీనివాస్, వినయ్కుమార్ సిబ్బంది వచ్చారు. ఫూల్గా మందు తాగారు.
ప్రభుత్వ ఆఫీసు అని కూడా మరిచిపోయి డ్యాన్సులు చేశారు. ఒక దశలో మద్యం మత్తులో సిబ్బంది ఒకరిని ఒకరూ బూతులు తిట్టుకుంటూ నానా రభస సృష్టించారు. గమనించిన స్థ్ధానికులు మీడియా ప్రతినిధులకు సమాచారం అందించారు.
వారొచ్చేసరికి..
మీడియా ప్రతినిధులు వచ్చేసరికి సిబ్బంది అక్కడి నుంచి జారుకున్నారు. ఒక అధికారి మాత్రం మా కార్యాలయంలో మేం దావత్ చేసుకుంటే మీకేటంటూ మీడియా ప్రతినిధులతో కొద్దిసేపు వాగ్వివాదానికి దిగారు.
ఇదే తంతు..
రాత్రి వేళల్లో కొంతమంది సిబ్బంది ఈ మండల కార్యాలయంలోనే విందులు చేసుకుంటూ మందు తాగుతూ బార్గా మార్చి వేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే కార్యాలయ ఆవరణంలో ఉన్న అమ్మవారి దేవాలయం వద్ద నెలలో రెండు సార్లు సిబ్బంది దావత్లు చేసుకుని జల్సాలు చేస్తున్నట్లు తెలిసింది.
సాక్ష్యాలు ఇవే..
కార్యాలయ ఆవరణంలో దర్శనమిస్తున్న మద్యం, బీరు బాటిళ్ళు, బొమికలు దీనికి సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.
ఇలా కనిపించాయి..
మీడియా ప్రతినిధులు వస్తున్నారని సిబ్బంది పలాయనం చిత్తగించిన తర్వాత అక్కడి దృశ్యాలు ఇలా కనిపించాయి.
ఇలాగేనా..
అంబర్పేట మండల కార్యాలయంలో సిబ్బంది మందు సేవించి, నృత్యాలు చేసి హంగామా చేశారు. మండల కార్యాలయాన్ని పానశాలగా మార్చేశారు.