బలి తీసుకున్న 'ప్రేమ': ఫేస్బుక్లో ఫోటోలతో పోస్ట్.. భంగపడి ఆత్మహత్య!
ప్రియురాలే ప్రపంచంగా.. ఆమె చుట్టే తన భవిష్యత్తు కలలను అల్లుకున్న ఓ యువకుడికి భంగపాటే ఎదురైంది.
శ్రీరాంపూర్: ప్రియురాలే ప్రపంచంగా.. ఆమె చుట్టే తన భవిష్యత్తు కలలను అల్లుకున్న ఓ యువకుడికి భంగపాటే ఎదురైంది. కనిపెంచిన తల్లిదండ్రుల గురించి కూడా ఆలోచించకుండా.. క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడి వారికి పుట్టెడు శోకాన్ని మిగిల్చాడు.
హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న నరేష్(25) అనే యువకుడు హసన్ పర్తిలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడం.. ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. తన చావుకు కారణం తనను మోసం చేసిన యువతి అని పేర్కొంటూ.. ఫేస్బుక్లో అతను సూసైడ్ లెటర్ పోస్ట్ చేయడం గమనార్హం.
ఎవరీ నరేష్?:
సీసీసీలోని నస్పూర్ కాలనీకి చెందిన మేకా మల్లయ్య సింగరేణి ఎస్సార్సీ-3లో గని కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఇతనికి ముగ్గురు కుమారులు, అందులో నరేష్ చిన్నవాడు. స్థానిక తెలంగాణ కాలనీలో వీరి కుటుంబం నివాసముంటోంది.
ఆర్కే-6 కాలనీలో శ్రీవాణి విద్యానికేతన్లో చదివిన నరేష్.. ఇంటర్, డిగ్రీ మంచిర్యాలలో పూర్తి చేశాడు. ఆపై వరంగల్ లోని వాగ్దేవి ఇంజనీరంగ్ కాలేజీలో ఎంబీఏ(ఫైనాన్స్) పూర్తి చేశాడు.
చెన్నైలో ఉద్యోగం వదిలి ప్రియురాలి కోసం:
ఎంబీఏ పూర్తయిన తర్వాత చెన్నైలోని క్యాప్ జెమిని సంస్థలో నరేష్ ప్రాసెస్ అసోసియేట్ గా ఉద్యోగంలో చేరాడు. అయితే అంతకుముందే శ్రీరాంపూర్లోని కృష్ణాకాలనీకి చెందిన ఒక యువతితో నరేష్ ప్రేమలో పడ్డాడు.
ఆమె కోసం చెన్నైలో ఉద్యోగాన్ని వదులుకుని హైదరాబాద్ వచ్చాడు. ప్రియురాలు కూడా హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తోంది. ప్రస్తుతం ఉద్యోగ వేటలో వెన్న నరేష్కు ఆమెతో భేదాభిప్రాయాలు రావడంతో.. ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం బెడిసికొట్టింది.
ఇంట్లో ఒప్పుకోరని:
నాలుగేళ్లుగా నరేష్ ఆమెను ప్రేమిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తమ ఇంట్లో ఈ వ్యవహారాన్ని ఒప్పుకోరని, ఇద్దరి మధ్య ప్రేమకు ఫుల్ స్టాప్ పెట్టేద్దామని నరేష్కు ఆమె చెప్పింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన నరేష్.. అప్పటి నుంచి పరధ్యానంగా ఉంటున్నాడు. యువతికి దూరమవడం ఇష్టం లేక తనలో తానే కృంగిపోయాడు. ఇదే క్రమంలో సోమవారం యువతి పుట్టినరోజు కావడంతో.. కలుద్దామని యువతిని కోరాడు.
హాస్టల్ వద్దకు వెళ్లి:
సోమవారం యువతి పుట్టిన రోజు కావడంతో.. ఆరోజు ఆమెను కలవాలని నరేష్ భావించాడు. ఇదే విషయం ఆమెతో చెబితే బయటకు రావడం కుదరదని, అన్నయ్య వస్తున్నాడని చెప్పింది. వీలైతే సాయంత్రం కలుద్దామని చెప్పింది.
అయితే అంతసేపు వేచిచూడలేక.. ఉదయాన్నే నరేష్ ఆమె ఉంటున్న హాస్టల్ వద్దకు వెళ్లాడు. తీరా అక్కడికెళ్లాక.. ఆమె వేరే అబ్బాయితో చనువుగా ఉండటం చూసి షాక్ తిన్నాడు. గతంలో ఆ వ్యక్తి వల్లే తమ మధ్య గొడవలు జరిగాయని, ఇప్పుడదే వ్యక్తితో ఆమె చనువుగా ఉండటం తట్టుకోలేకపోయానని నరేష్ తన ఫేస్ బుక్ పోస్టులో పేర్కొన్నాడు.
ఫోటోలు ఫేస్ బుక్ లో పెట్టి:
యువతిని వేరే వ్యక్తితో చూసి కలత చెందిన నరేష్.. ఇక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. సోమవారం మధ్యాహ్నాం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ ద్వారా బయలుదేరి హసన్ పర్తి స్టేషన్ లో దిగాడు. చనిపోయే ముందు తల్లిదండ్రులను క్షమించమిని కోరుతూ, అలాగే తనను మోసం చేసిన యువతి ఫోటోలను ఫేస్ బుక్ లో పెట్టి.. ఆపై రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు యువతితో పాటు మరో మరో ముగ్గురు కారణమంటూ పేరు, వివరాలతో సహా పేర్కొన్నాడు.