రియల్టర్ కూతురితో ప్రేమ: చంపేసి శవాన్ని నాపరాయి గనిలో పూడ్చేశారు
తాండూరులో పరువు హత్య జరిగింది. తన కూతుర్ని ప్రేమించిన పేదింటి యువకుడిని ఓ రియల్టర్ పథకం ప్రకారం కిరాయి హంతకులతో చంపించాడు.
తాండూరు: తాండూరులో పరువు హత్య జరిగింది. తన కూతుర్ని ప్రేమించిన పేదింటి యువకుడిని ఓ రియల్టర్ పథకం ప్రకారం కిరాయి హంతకులతో చంపించాడు. శవాన్ని నాపరాళ్ల గని గుంతలో పాతేపించాడు. నాలుగు రోజుల కిందట అదృశ్యమైన ఆ యువకుడి మృతదేహం ఆదివారం కనిపించింది.
వికారాబాద్ జిల్లా తాండూరులోని సాయిపూర్కు చెందిన బెస్త యాదప్ప(21), అదే ప్రాంతానికి చెంది న ఓ ధనికుడైన రియల్టర్ వ్యాపారి కూతుర్ని ఆరేళ్ళుగా ప్రేమిస్తున్నాడు. దీంతో యాదప్పను రియల్టర్ బెదిరించాడు. ఈ వ్యవహారం పంచాయితీ, పోలీస్ స్టేషన్ వరకు వెళ్లగా పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.
ఎంత చెప్పినా తన కూతుర్ని మరిచిపోవడం లేదని యాదప్పను హత్య చేసేందుకు కిరాయి హంతకులతో రియల్టర్ ఒప్పందం చేసుకున్నాడు. తన వద్ద పని చేస్తున్న డ్రైవర్ను తొలగించినట్లు నాటకమాడి యాదప్పతో స్నేహం చేయించాడు. పథకం ప్రకారం ఈ నెల 20న యాదప్పను వాహనంలో బషీరాబాద్ మండలం కొర్విచేడ్ గని వద్దకు రప్పించాడు. అక్కడ యాదప్ప గొంతు నులిమి హత్య చేశారు.
అతడి మృతదేహాన్ని నాపరాయి గనుల వద్దకు తీసుకువెళ్లి పూడ్చిపెట్టారు. కాగా, తన కుమారుడు కనిపించడం లేదని యాదప్ప తల్లి నర్సమ్మ తాండూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా, యువకుడిని హత్య చేసిన రోజే భయాందోళనకు గురైన డ్రైవర్ పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది.