హోలీ విషాదం: మరదలు చల్లిన రంగుతో బావ మృతి
బాలిక చల్లింది టర్పెంటాయిల్ కావడం.. ఆ సమయంలో చందర్ నాయక్ పొయ్యి పక్కన్నే నిలుచుని ఉండటంతో అతనికి మంటలు అంటుకున్నాయి.
హైదరాబాద్: హోలీ రోజు నగరంలోని సింగరేణి కాలనీలో విషాద సంఘటన చోటు చేసుకుంది. రంగు నీళ్లు అనుకుని టర్పెంటాయిల్ చల్లడంతో ఓ బీటెక్ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో హోలీ సరదా కాస్త ఆ కుటుంబంలో విషాదాన్ని మిగిల్చినట్లయింది.
వివరాల్లోకి వెళ్తే.. నాగర్ కర్నూల్ జిల్లా, లింగాల మండలం దేవుని తండాకు చెందిన చందర్ నాయక్(24) అలియాస్ చందు సింగరేణి కాలనీలోని అతని సోదరుని ఇంట్లో ఉంటూ గురునానక్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల హోలీ పండుగ నాడు వరుసకు మరదలయ్యే బాలిక(15)తో హోలీ ఆడాడు.
ఇద్దరు రంగులు చల్లుకుంటున్న సమయంలో.. ఓ సీసాలో ఉన్న రంగు నీళ్లను బావపై ఆ బాలిక చల్లింది. అయితే అవి రంగు నీళ్లు అని పొరబడటమే అసలు విషాదానికి కారణమైంది. బాలిక చల్లింది టర్పెంటాయిల్ కావడం.. ఆ సమయంలో చందర్ నాయక్ పొయ్యి పక్కన్నే నిలుచుని ఉండటంతో అతనికి మంటలు అంటుకున్నాయి.
ఆపై ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున చందర్ నాయక్ కన్నుమూశాడు.
కష్టపడి ఉన్నత చదువులు.. ఇంతలోనే విషాదం:
పేద కుటుంబ నేపథ్యం కావడంతో చందర్ నాయక్ కష్టపడి బీటెక్ వరకు వచ్చాడు. ఖాళీ సమయాల్లో ఆటో నడుపుతూ వచ్చిన డబ్బులతో డిప్లోమా పూర్తి చేశాడు. ప్రస్తుతం బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న చందర్ నాయక్ గేట్ పరీక్షకు సన్నద్దమవుతున్నాడు. ఇంతలోనే ఊహించని విషాదంతో అతను ప్రాణాలు కోల్పోవడం ఆ కుటుంబాన్ని తీవ్ర శోకంలో ముంచింది.
బంధువుల ఆందోళన:
చందర్ నాయక్ మృతితో కుటుంబ సభ్యులు, సింగరేణి కాలనీ వాసులు రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. ప్రభుత్వం అతని కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.