మూడో రైల్వే లైన్: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం కానుక
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం కానుక ప్రకటించింది. వరంగల్ జిల్లా కాజీ పేట నుంచి మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా బల్లార్షా స్టేషన్ వరకు మూడో రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్రం ఆమోద ముద్ర వేసింది. దీని అంచనా వ్వయం రూ. 2,063 కోట్లు కాగా, నిర్మాణం పూర్తయ్యేసరికి రూ. 2,403 కోట్లు కావచ్చని భావిస్తున్నారు.
ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన ఆర్ధిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 201.4 కిలో మీటర్లు పొడవైన ఈ రైల్వే లైన్ ఐదేళ్లలో పూర్తికావచ్చని భావిస్తున్నారు. ఈ రైల్వే లైన్ ద్వారా తెలంగాణలోని వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలతో పాటు మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాను కవర్ చేస్తుంది.
ఈ రైల్వే లైన్ ద్వారా పవర్ ప్లాంట్స్, బొగ్గు, సిమెంట్ రవాణా, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మూడో లైన్ను మంజూరు చేశారు. దీంతో పాటు న్యూఢిల్లీ-చెన్నై గ్రాంట్ ట్రంక్ మార్గంలో కాజీపేట-బల్లార్షా మూడో లైన్ ఉంటుంది.
ఈ రైల్వే లైన్ ద్వారా జమ్మికుంట పుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ), రాఘవపురం కేసోరామ్ సిమెంట్, మంచిర్యాల థర్మల్ పవర్ స్టేషన్, ఎస్సీసీఎల్ నుంచి గూడ్సును రవాణా చేస్తారు. ఆసిఫాబాద్, బెల్లంపల్లి, రెచ్నిరోడ్ నుంచి బొగ్గు రవాణా.. మానిక్గఢ్, ఘట్చందూర్ నుంచి సిమెంట్ను ఇదే మార్గంలో రవాణా చేయనున్నారు.
ఇక ఏపీలో విజయవాడ-గూడురు మధ్య మూడో రైల్వే లైన్ నిర్మాణానికి కూడా కేంద్ర కేబినెట్ అనుమతి మంజూరు చేసింది. ఈ రైల్వే లైన్ నిర్మాణానికి రూ. 3246 కోట్లు ఖర్చు కావచ్చని అంచనా వేసింది. బుధవారం కేంద్ర కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలివే.
ఉగ్రవాదుల దాడి, మతకలహాలు, వామపక్ష తీవ్రవాదుల దాడి, మందుపాతర పేలుడు, సరిహద్దు వద్ద కాల్పుల్లో మరణించిన పౌరుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం పరిహారం అందించేందుకు అంగీకరించింది. ఈ ఘటనల్లో మరణించినవారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల పరిహారం అందజేస్తారు.