ముప్పు: 5జిల్లాల్లో పెరుగుతున్న మధు మేహం, బీపీ, క్యాన్సర్ వ్యాధులు
కేన్సర్ కబళిస్తోంది.. రక్తం పోటెత్తుతోంది... మధుమేహం తీయగా తిష్టేస్తోంది... వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జయశంకర్, మహబూబాబాద్, జనగామ జిల్లాల్లో ఈ వ్యాధులు రోజురోజుకు పెరుగుతున్నాయి.
వరంగల్: కేన్సర్ కబళిస్తోంది.. రక్తం పోటెత్తుతోంది... మధుమేహం తీయగా తిష్టేస్తోంది... వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జయశంకర్, మహబూబాబాద్, జనగామ జిల్లాల్లో ఈ వ్యాధులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మొదటి విడతలో భాగంగా నిరుడు జూన్ నుంచి అక్టోబరు వరకు నిర్వహించిన ముందస్తు గుర్తింపు, నివారణ పరీక్షల్లో ఈ కఠోర నిజాలు వెల్లడయ్యాయి.ప్రస్తుతం రెండో దశ కొనసాగుతోంది. ఇందులో పూర్తి స్థాయిలో పరీక్షిస్తే బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.
రాష్ట్రంలో ఇప్పటి వరకు అంటు వ్యాధులు కానీ జబ్బుల (నాన్ కమ్యూనికబుల్ డిసీస్)కు సంబంధించిన వైద్య ఆరోగ్య శాఖ దగ్గర ఎలాంటి సమాచారం లేదు. ఎంత మంది బీపీ, షుగర్, కేన్సర్ రోగులున్నారని అడిగితే ఎవరూ చెప్పరు. ఆయా వ్యాధుల బారిన పడిన వారు ప్రైవేటు ఆసుపత్రులలో వైద్యం చేసుకుంటున్నారు. పైగా ఈ వ్యాధుల నివారణ ఖర్చులతో కూడినది కావడంతో పేదలకు ఖరీదైన వైద్యం అందని ద్రాక్షలా మారింది.
చాలా మందికి సకాలంలో వైద్యం అందక మృత్యువాత పడుతున్నారు. ప్రైవేటు దవాఖానాల్లోని నిపుణులు అందించే సమాచారమే సర్కారుకు ఆధారమవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ దేశంలోని అన్ని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు ఏ ఏ వ్యాధులకు గురవుతున్నారో తెలుసుకోవడానికి గతేడాది జాతీయ ముందస్తు కేన్సర్, మధుమేహం బీపీ వ్యాధుల గుర్తింపు, నివారణ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఇందు కోసం అవిభాజ్య జిల్లాలోని ఏఎన్ఎంలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. వారికి పలు పరికరాలను అందించింది. 69 ప్రాథమిక, 590 ఉప ఆరోగ్య కేంద్రాల పరిధిలోని గ్రామాల్లో చేసిన వైద్య పరీక్షల్లో ఆసక్తికరమైన వివరాలు బయటపడ్డాయి.
ముదురుతున్న వ్యాధులు..
64,822 మందికి పరీక్షలు నిర్వహించగా అందులో 6,127 మంది మధుమేహం బారిన పడుతున్నారని నిర్ధరణ అయింది. ఇందులో స్త్రీలు 3006 మంది ఉన్నారు. 4215 మంది రక్తపోటుతో బాధపడుతున్నారని వెల్లడైంది. స్త్రీల సంఖ్య 2077గా తేలింది. కేన్సర్ బాధితులూ ఎక్కువగానే ఉన్నట్లు బయటపడింది. 1909 మందిని పరీక్షించగా.. అందులో 56 మందికి వ్యాధి ఉంది. అందరికీ పూర్తి స్థాయిలో పరీక్షలు నిర్వహిస్తే వ్యాధిగ్రస్థుల సంఖ్య కచ్చితం ఎంత అన్నది తెలుస్తుందని అధికారులు అంటున్నారు.
మారిన జీవన శైలి.. ఆహార అలవాట్లే కారణం..
మారిన జీవన శైలి.. ఉరుకులు, పరుగులతో కూడిన యాంత్రిక జీవనం.. వృత్తిపరమైన ఒత్తిళ్లు .. సమయ పాలన లేని ఆహారం .. నిద్రలేమి... ఇవన్నీ మధుమేహం, రక్తపోటు రావడానికి కారణమని వైద్యులంటున్నారు. వీటికి తోడు పాన్, గుట్కా, జర్ధా, సిగరెట్, వేపుడు ఆహారం ఎక్కువగా తీసుకోవడం, మద్యం అలవాటు క్యాన్సర్ రావడానికి హేతువులని అంటున్నారు. ప్రకృతి పాఠాలకు అనుగుణంగా నడుచుకోవడంతో పాటు చెడు అలవాట్లు మానుకోవడం, ఆహార నియమాల్లో సమయపాలన పాటించడం, పోషకాహారం ఉండే భోజనం తీసుకోవడం వల్ల ఈ వ్యాధులు రాకుండా చూసుకోవచ్చని వివరిస్తున్నారు.