వామ్మో, ఎండకాలం: అగ్నికి దగ్ధమైన కారు!(ఫోటో)
హైదరాబాద్: కారులో మంటలు చేలరేగి హైదరాబాదులో గురువారం కలకలం సృష్టించింది. నల్గొండ జిల్లా వలిగొండ సంగం గ్రామానికి చెందిన సురేందర్ కొంతకాలంగా సరూర్నగర్లో ఉంటూ కారును నడుపుతున్నాడు.
గురువారం మధ్యాహ్నం సురేందర్ (టిఎస్ 08 యుఏ 1865) ఇండికా కారులో అత్తాపూర్ నుంచి హైటెక్ సిటీ వైపు వెళ్తుంతుండగా అత్తాపూర్ బ్రిడ్జిపై ముందున్న ఇన్నోవాను ఢీకొంది. ఈ క్రమంలో కారు డ్రైవర్ సురేందర్, ఇన్నోవా డ్రైవర్లు ఇద్దరూ గొడవకు దిగారు.
అంతలోనే సురేందర్ కారుకు మంటలు అంటుకుని ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. ప్రమాదం, ఎండ వేడి కారణంగా తెలుస్తోంది. వెంటనే అక్కడ ఉన్న స్థానికులు, ప్రయాణికులు పరుగు తీశారు. స్థానికులు పోలీసులతో పాటు ఫైర్ స్టేషన్కు ఫోన్ ద్వారా సమాచారం అందజేశారు.
వెంటనే స్థానిక పోలీసులతో పాటు ఫైర్ ఇంజన్ కూడా సంఘటనా స్థలానికి చేరుకుంది. ఫైర్ ఇంజన్ నీళ్లుతో ఆర్పేసరికే కారుపూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం కలుగలేదు. బాధితుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.