ఓటుకు నోటులో బలమైన ఆధారాలు, 50లక్షలు ఎక్కడివో గుర్తించలేదా?
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో న్యాయస్థానంలో మంగళవారం ఛార్జీషీట్ దాఖలు అనంతరం ఏసీబీ అదనపు ఎస్పీ మల్లారెడ్డి మాట్లాడారు. ఓటుకు నోటు కేసులో బలమైన సాక్ష్యాలు ఉన్నాయని ఈ సందర్భంగా చెప్పారు.
తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్కు రూ.50 లక్షలు ఇచ్చిన వీడియో సాక్ష్యంతో పాటు ప్రత్యక్ష సాక్షులు, సైంటిఫిక్ సాక్ష్యాలు, ఆడియో, వీడియో ఆధారాలున్నాయని చెబుతున్నారు. కాల్ డేటా రికార్డులు ఉన్నాయని చెప్పారు.
అయితే, ఇప్పటి వరకు తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) రూ.50 లక్షలు ఎక్కడి నుండి వచ్చాయో గుర్తించలేదని తెలుస్తోంది.
కాగా, ఈ కేసులో ఫిర్యాదుదారుడైన నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కూడా కొన్ని విలువైన ఆధారాలు ఇచ్చారు. సెబాస్టియన్ ఫోన్లో కొన్ని ఆధారాలు రికార్డు అయి ఉన్నాయి. రేవంత్ రెడ్డి తనతో మాట్లాడిన ఆడియో, వీడియో టేపులను మే 28న ఏసీబీ అధికారులకు అందజేశారు.
నిందితుల సెల్ఫోన్ కాల్లిస్ట్ ఆధారంగా మరికొంత సమాచారం సేకరించారు. ఆ తర్వాత కోర్టు అనుమతితో వారి టెలిఫోన్ సంభాషణలపై ట్రాన్స్స్క్రిప్ట్ చేయించారు. ట్రాన్స్స్క్రిప్ట్ ఆధారంగా మరో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను విచారించారు.
మరోవైపు, నిందితుల తరుఫు న్యాయవాదులు మాట్లాడుతూ.. చార్జిషీట్ ప్రతుల కోసం పిటిషన్ దాఖలు చేయనున్నట్టు తెలిపారు. ఫోరెన్సిక్ నివేదిక ప్రతుల కోసం మంగళవారం పిటిషన్ దాఖలు చేసినట్టు తెలిపారు.