'ఆ బడ్జెట్ అంతా రేవంత్ కోసమే': ఈసీ చేతికి ఫోరెన్సిక్ రిపోర్ట్, దోషిగా తేలితే అంతే
హైదరాబాద్: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) బడ్జెట్ మొత్తం తమ పార్టీ కొడంగల్ శాసన సభ్యుడు రేవంత్ రెడ్డి కేసు కోసమే వాడుతున్నారని తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వివేక్ శుక్రవారం మండిపడ్డారు. సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలను కొన్నారని ఆరోపించారు.
మా ఎమ్మెల్యేలను కొని మమ్మలనే విమర్శిస్తారా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి తెలంగాణలో పెరుగుతున్న ఆదరణ చూసే కేసులు పెట్టారని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నాయకులు ర్యాలీలు తీస్తే ఎప్పుడైనా కేసులు పెట్టారా అని ప్రశ్నించారు.
ఈసీకి ఎఫ్ఐఆర్ అందజేత
ఓటుకు నోటు కేసు వివరాలు కావాలన్న ఎన్నికల సంఘం (ఈసీ) పిటిషన్ను ఏసీబీ న్యాయస్థానం శుక్రవారం అనుమతించింది. ఈసీ కోరిన దర్యాఫ్తు నివేదికతో పాటు ఎఫ్ఐఆర్ను కోర్టు అందజేసింది.
ఓటుకు నోటు కేసులో ఇది మరో కీలక పరిణామం అని చెప్పవచ్చు. ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా చేతికి ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ నివేదిక కాపీ అందింది. ప్రిన్సిపల్ కోర్టు ఆదేశాలతో ఎలక్షన్ కమిషన్ డాక్యుమెంట్లు పొందింది.
ఈ కేసుకు సంబంధించిన కాల్ డేటాను కూడా ఎలక్షన్ కమిషన్ పొందే అవకాశం ఉందంటున్నారు. దీనికి సంబంధించిన నివేదిక పొందడానికి ఈసీ కోర్టును కోరనుంది.
ఈ మొత్తం వ్యవహారం సోమవారంలోగా పూర్తి చేయాలని ఈసీ భావిస్తోంది. ఈ కేసులో నిందితులు దోషులుగా తేలితే ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించే అవకాశముంది. మరోవైపు, ఈసీ డాక్యుమెంట్లను స్టడీ చేసిన తర్వాత ఎన్నికల చట్టాలకు సంబంధించిన కేసు కూడా పెట్టే అవకాశాలున్నాయి.