ఓటుకు నోటు: ఏసీబీ పక్షాన కపిల్ సిబాల్ సహా సీనియర్లు రంగంలోకి
న్యూఢిల్లీ: ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని సుప్రీం కోర్టును తెలంగాణ ఏసీబీ గురువారం ఆశ్రయించింది. ఏసీబీ తరపున వాదించే వారిలో మాజీ కేంద్రమంత్రి కపిల్ సిబాల్ ఉన్నట్లుగా తెలుస్తోంది.
శుక్రవారం నాడు రేవంత్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ విచారణకు రాహనుంది. ఏసీబీ తరఫున వాదనలు వినిపించేందుకు కపిల్ సిబాల్, దుష్యంత్ దవే, హరేన్ రావెల్లను రంగంలోకి దించనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
గురువారం సీఎం కేసీఆర్ను కలిసి చర్చించిన అనంతరం ఏసీబీ డీజీ ఏకే ఖాన్ సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. ఈ నేపథ్యంలో సీనియర్లను రంగంలోకి దించనున్నారని తెలుస్తోంది.
సండ్ర విచారణకు రంగం సిద్ధం?
సండ్ర వెంకట వీరయ్యపై చర్యలు తీసుకునేందుకు ఏసీబీ సిద్ధమవుతోంది. సండ్రకు నోటీసులు జారీ చేసి 20 రోజులు దాటినా అనారోగ్య కారణాల్ని చూపుతూ విచారణకు హాజరుకావడం లేదు. తొలుత వెన్నునొప్పితో బాధపడుతున్నానని, పది రోజులు విశ్రాంతి అవసరమని సండ్ర జూన్ 19న లేఖ రాశారు.
ఆ గడువు ముగిశాక విచారణకు హాజరవుతారని భావించినా తాజాగా సండ్ర ఏసీబీకి మరో లేఖ రాస్తూ రాజమండ్రిలో చికిత్స పొందుతున్నానని, కోలుకున్నానని విచారణకు పిలిస్తే వస్తానని చెప్పారు.
కాగా, సండ్రకు ఇప్పటికే నోటీసులు జారీ చేశామని, ఆయన విచారణకు హాజరుకాకుండా పిలిస్తే వస్తానని చెప్పడాన్ని ఏసీబీ తీవ్రంగా పరిగణిస్తోందని సమాచారం. దీంతో సండ్ర వ్యవహారంలో తదుపరి చర్యలు ఎలా తీసుకోవాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. మరోవైపు, తాను అందుబాటులోనే ఉన్నానని సండ్ర చెబుతున్నారు. ఎప్పుడు పిలిచినా వస్తానని చెప్పారు. అందులో తన సెల్ నెంబర్ కూడా ఇచ్చారు.