ఓటుకు నోటుపై వైసిపి ఎమ్మెల్యే ఫిర్యాదు అదే, రేవంత్కు సమన్లు, బాబును విచారిస్తాం!
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఓటుకు నోటు కేసును అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వేగవంతం చేయనుంది. ఈ కేసు మరోసారి తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం నాడు ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది.
పాత ఎఫ్ఐఆర్తోనే విచారణ కొనసాగిస్తామని కోర్టుకు ఏసీబీ తెలిపింది. సెప్టెంబర్ 29వ తేదీలోపు నివేదికను అందజేస్తామని చెప్పింది. సెప్టెంబర్ 29లోపు చంద్రబాబుపై విచారణ జరిపి నివేదిక సమర్పిస్తామని కోర్టుకు ఏసీబీ తెలిపినట్లుగా కూడా తెలుస్తోంది.
ఓటుకు నోటు కేసును ఇప్పటికే దర్యాఫ్తు జరుపుతున్నామని ఏసీబీ కోర్టుకు తెలిపింది. అందరి పాత్రలను విచారిస్తున్నామని చెప్పింది. దర్యాఫ్తు పూర్తయ్యాక అనుబంధ ఛార్జీషీట్ దాఖలు చేస్తామని తెలిపింది. వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి చేసిన ఫిర్యాదు, నమోదైన కేసు ఒక్కటేనని చెప్పారు. ఇప్పటికే చాలా ఆధారాలు సేకరించామని, కౌన్ని ఆధారాలను ఎస్ఎఫ్ఎల్కు పంపించామని చెప్పారు.
ఏసీబీ గతంలో వేసిన చార్జీషీటును న్యాయస్థానం పరిగణలోకి తీసుకుంది. ఛార్జీషీట్ నెంబర్ 15/16గా నమోదు చేసుకుంది.
తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, కేసులో మరో ఇద్దరు నిందితులు సెబాస్టియన్, ఉదయ్ సిన్హాలకు న్యాయస్థానం సమన్లు జారీ చేసిందీ. సెప్టెంబర్ 29వ తేదీలోపు కోర్టు ఎదుట హాజరు కావాలని ఆదేశించింది.
'ఓటుకు నోటుపై రాజీ': ఏ1గా.. బాబుపై ఎఫ్ఐఆర్కు ఛాన్స్! ఏం జరిగింది?
ఇదిలా ఉండగా, ఓటుకు నోటు కేసులో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్తో మాట్లాడిన సంభాషణ చంద్రబాబుదే అని ముంబైకి చెందిన హెలిక్ డిజిటల్ ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికతో బయటపడినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
ఈ నివేదికతో ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి పిటిషన్ వేయడం, నివేదిక సమర్పించాలని ఏసీబీ డీజీని ఏసీబీ కోర్టు ఆదేశించింది. ఆ మేరకు చంద్రబాబుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, విచారించేందుకు ఏసీబీ సిద్ధమవుతున్నట్లుగా కూడా జోరుగా వార్తలు వస్తున్నాయి.
గతేడాది దాఖలుచేసిన చార్జిషీట్లోనూ 33సార్లు చంద్రబాబు పేరును ఏసీబీ ప్రస్తావించింది. దీనితో ఏ విధంగా చూసినా చంద్రబాబును విచారించక తప్పని పరిస్థితి ఏర్పడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విచారణలో చంద్రబాబు చెప్పే అంశాలను బట్టి, నివేదిక తయారు చేసి, కోర్టు ఆదేశాల మేరకు వచ్చే నెల 29లోపు అందించాల్సి ఉంటుందని అంటున్నారు.
మరోవైపు, చంద్రబాబుపై ఎఫ్ఐఆర్ నమోదు అవడం ఖాయమని ఏపీ ఇంటెలిజెన్స్లో పని చేస్తున్న అధికారి తమతో అన్నట్లుగా నమస్తే తెలంగాణ పేర్కొంది. చట్టప్రకారం ఎఫ్ఐఆర్ నమోదుచేసిన తర్వాత విచారణకు నోటీసులిచ్చే అధికారం దర్యాప్తు అధికారికి ఉంటుందని ఆయన తెలిపారని పేర్కొంది.
చంద్రబాబు సీనియర్ సిటిజన్, పైగా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడంతో ఆయన ఇంటికి వెళ్లి విచారించుకోవాల్సి ఉంటుందన్నారు. సీఆర్పీసీ ప్రకారం అరవై ఏళ్లు దాటిన వారిని పోలీస్ స్టేషన్కు, దర్యాప్తు సంస్థ వద్దకు పిలువడం కుదరదని చెప్పారని పేర్కొన్నారు.
దీంతో నేరుగా చంద్రబాబు ఇంటికి వెళ్లి కేసు విషయంలో విచారణకు సహకరించేలా విజ్ఞప్తి చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఆయన సహకరించకపోతే కోర్టు ద్వారా అరెస్ట్ వారెంట్ జారీ చేసే అధికారం కూడా ఉంటుందని సదరు అధికారి చెప్పారని పేర్కొన్నారు.
ఓటుకు నోటు కేసు మళ్లీ తెరపైకి రావడంతో ఏం చేయాలన్న దానిపై ఏపీ ఇంటెలిజెన్స్, న్యాయ సలహాదారులు తదితరులతో చంద్రబాబు మంగళవారం రాత్రి సమయంలో భేటీ అయినట్టుగా తెలుస్తోందని వార్తలు వస్తున్నాయి.
ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే ఆ తర్వాత హైకోర్టు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని కూడా చంద్రబాబు ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. గతంలో ఓటుకు నోటు తెరపైకి వచ్చినప్పుడు ఏపీ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ను తెరపైకి తెచ్చింది. ఇప్పుడు మరోసారి దానిని తీసుకువస్తుందా అనే చర్చ సాగుతోంది.