ఆడియో, వీడియో అసలైందా: ఫోరెన్సిక్ తుది నివేదిక రెడీ, ఏసీబీ దూకుడు
హైదరాబాద్: ఓటుకు నోటు కేసు దర్యాఫ్తులో కీలకమైన ఫోరెన్సిక్ సైన్స్ లేబోరేటరీ తుది నివేదిక గురువారం కోర్టుకు అందింది. తుది నివేదికలో వీడియో, ఆడియో వివరాలను విశ్లేషించి పొందుపరిచింది. స్టీఫెన్ సన్ను రేవంత్ రెడ్డి ప్రలోభ పెట్టారని ఆరోపిస్తూ ఏసీబీ ముగ్గురిని అరెస్టు చేసింది.
ఆడియో, వీడియో ఆధారాలను ఫోరెన్సిక్కు పంపించింది. వాటిని ఫోరెన్సిక్ సైన్స్ లేబోరేటరీ క్షుణ్ణంగా పరిశీలించి నివేదికను రూపొందించింది. ప్రాథమిక నివేదికలో ఆడియో, వీడియో టేపులు అసలైనవా కాదా అన్న అంశాన్ని నిర్ధారించింది. తుది నివేదికలో అందులోని అంశాలను విశ్లేషించింది.
దృశ్యాలతో పాటు ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకొని అందచేసిన సెల్ ఫోన్లోని మెసేజ్లను కూడా పరిశీలించింది. ఈ సమాచారాలు ఎవరు పంపారు, వారి పేర్లు తదితర వివరాలు తేల్చింది. ఫోన్లలో తొలగించిన మెసేజ్లను ఎవరు పంపారు, అందులోని వివరాలను పేర్కొంది. కాల్ డేటాను విశ్లేషించి తుది నివేదిక ఇచ్చింది.
కాగా, ఫోరెన్సిక్ సమర్పించిన తుది నివేదిక ప్రతిని తమకు ఇవ్వాలని ఏసీబీ... న్యాయస్థానంలో మెమో దాఖలు చేసింది. కాగా, ఫోరెన్సిక్ తుది నివేదిక సమర్పించిన నేపథ్యంలో అందులోని వాయిస్ ధృవీకరించాల్సి ఉంది. వాయిస్ శాంపిల్ కోసం ఆయా వ్యక్తులకు కోర్టు ద్వారా నోటీసులు జారీ చేసే అవకాశముంది.
ఫోరెన్సిక్ సమర్పించిన నివేదిక ఆధారంగా ఏసీబీ దూకుడు పెంచనుంది. ఏసీబీ ఇప్పటికే అరెస్టైన రేవంత్ రెడ్డిని, సెబాస్టియన్ను, ఉదయ్ సిన్హాలను నాలుగు రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని విచారించింది. ఈ ఆధారాలతో దూకుడు పెంచనుంది.