ఎసిబి విచారణకు జిమ్మీ డుమ్మా: అరెస్టు తప్పదా?
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) ఎదుట విచారణకు రావాల్సి ఉన్న తెలుగు యువత ప్రధాన కార్యదర్శి జిమ్మీబాబు డుమ్మా కొట్టారు. దీంతో ఆయన కదలికలపై ఎసిబి కన్నేసినట్లు తెలుస్తోంది. జిమ్మీకి కూడా సీఆర్పీసీ సెక్షన్ 41 ఏ ప్రకారం నోటీసులు ఇచ్చింది.
ఈ నేపథ్యంలో ఎసిబి ఏ విధమైన చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఆయన తమ ముందు విచారణకు హాజరుకాని పక్షంలో అరెస్టు తప్పదనే పద్ధతిలో ఎసిబి వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు. కాగా, జిమ్మీ ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని ప్రచారం జరుగుతున్నది. ఏసీబీ ఇచ్చిన నోటీసులను జిమ్మీ బాబు కోర్టులో సవాల్ చేయనున్నట్లు ప్రచారం సాగుతోంది.
నోటీసుల్లో ఎక్కడా కూడా నిందితుడని, లేదా సాక్షి అని ఏసీబీ చెప్పలేదు. దీనితో న్యాయస్థానానికి వెళ్లినా స్టే పిటిషన్ డిస్మిస్ అవుతుందని న్యాయనిపుణులు జిమ్మీ వర్గానికి తేల్చిచెప్పడంతో వెళ్లలేదని మీడియాలో వార్తలు వచ్చాయి.ఈ ప్రచారం నేపథ్యంలో ఏసీబీ అధికారులు అప్రమత్తమైనట్లు చెబుతున్నారు.
జిమ్మీ విచారణకు హాజరుకాలేదన్న విషయాన్ని ఎసిబి డీజీ ఏకే ఖాన్కు తెలిపారు. దీనితో ఏకే ఖాన్ రంగంలోకి దిగి దర్యాప్తు అధికారులతో మధ్యా హ్నం భేటీ అయినట్టు సమాచారం. రేవంత్కు బెయిల్ వచ్చేవరకు గుంటూరు, విజయవాడ, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో తలదాచుకున్న జిమ్మీ సండ్ర అరెస్టు నేపథ్యంలో మళ్లీ అండర్గ్రౌండ్కు వెళ్లిపోయినట్లు చెబుదతున్నారు.
దాంతో జిమ్మీ కోసం ఎసిబి గాలింపు చర్యలు ప్రారంభించినట్లు చెబుతున్నారు. కేసులో కీలకంగా ఉన్న వారందరినీ అరెస్ట్ చేసేందుకు వ్యూహాత్మంగా అడుగులు వేస్తున్న ఉన్నతాధికారులు జిమ్మీని సైతం అదుపులోకి తీసుకొని, విచారించేందుకు ఓ ఎస్పీ నేతృత్వంతో రెండు బృందాలను ఏర్పాటుచేశారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.