ఓటుకు నోటు, జగన్కు షాకే: ఏడాదిలో తారుమారు, ఎవరికి లాభం?
హైదరాబాద్/విజయవాడ: గత ఏడాది ఓటుకు నోటు, అనంతరం ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనం సృష్టించాయి. ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబు, ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ సీఎం కేసీఆర్ ఇబ్బందుల్లో పడతారని పెద్ద ఎత్తున మీడియాలో ప్రచారం జరిగింది.
అయితే, ఆ తర్వాత ఇద్దరి మధ్య స్నేహం విరబూసినట్లుగా కనిపిస్తోంది. ఓటుకు నోటు కేసు జరిగి ఏడాది దాటింది. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్కు రూ.5 కోట్ల ఆఫర్ ఇస్తూ రేవంత్ రెడ్డి దొరికారు.
ఈ కేసు విషయమై టిఆర్ఎస్, టిడిపి నేతల మాటల యుద్ధం నడిచింది. చంద్రబాబు, కేసీఆర్ల మధ్య కూడా వాగ్యుద్ధం నడిచింది. ఓటుకు నోటు చంద్రబాబు మెడకు, ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ మెడకు చుట్టుకుంటాయని ఆందరూ భావించారు. కానీ, ఈ ఘటన జరిగి ఏడాది అవుతున్నా ఎలాంటి పురోగతి లేదనేది విపక్షాల వాదన.
ఇరు రాష్ట్రాల సీఎంల మధ్య ఓటుకు నోటు కేసు చివరకు రాజీ కుదిర్చి సద్దుమణిగిందని అంటున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసు రెండు రాష్ట్రాల్లో కీలక మార్పులకు దోహదమైంది. పదేళ్ల ఉమ్మడి రాజధాని సౌకర్యం ఉన్నా చంద్రబాబు రాజధాని విజయవాడకు తరలి వెళ్లారు.
గతంలో ఈకేసు విషయమై ఒకరిపై ఒకరు నిప్పులు కురిపించుకున్నారు. ఇప్పుడు అది కనిపించడం లేదని విపక్షాలు అంటున్నాయి. ఇటీవలి కాలంలో ప్రాజెక్టులు తదితర అంశాలపై విమర్శలు గుప్పించుకుంటున్నారు.
గత ఏడాది హైదరాబాద్లో జరిగిన మహానాడులో కెసిఆర్నే లక్ష్యం చేసుకుని చంద్రబాబు ఉపన్యాసాలు చేశారు. ఓటుకు నోటు కేసు అనంతరం తిరుపతిలో జరిగన మహానాడులో కెసిఆర్ను చంద్రబాబు ఎక్కడా ఒక్కమాట అనలేదు.
ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య రాజీ కుదిరిందని వైసిపి అధినేత జగన్, ఇరు రాష్ట్రాల కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు ఇబ్బందుల్లో పడతారని ఈ కేసు ద్వారా భావించిన, కేసుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న వైసీపికి ఇది నిరాశ కలిగించే అంశమే అంటున్నారు.
సంచలం సృష్టించి హఠాత్తుగా సద్దుమణిగిన ఓటుకు నోటు కేసుకు మంగళవారం నాటికి ఏడాది అవుతుంది. ఎమ్మెల్సీకి ఐదు కోట్లు చెల్లించేలా ఒప్పందం కుదిరి 50 లక్షల రూపాయలు అడ్వాన్స్ చెల్లించి ఏసీబీకి పట్టుబడిన వైనం తెలిసిందే. ఇదే తరహాలో ఓటు కొనుగోలు వ్యవహారంలో ఒకవైపు స్వయంగా సిఎంని విచారించగా, తెలంగాణలో మాత్రం ఏడాది గడిచినా కేసుకు సంబంధించి ఎలాంటి పురోగతి లేదంటున్నారు.
కేంద్ర ఎన్నికల కమిషన్ సైతం ఓటు కొనడానికి జరిగిన ప్రయత్నంపై అప్పుడు వివరాలు తెప్పించుకుంటున్నట్టు ప్రకటించింది. ఈ కేసు సమయంలో హైదరాబాద్లో సైతం ఆంధ్ర పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని మంత్రి అచ్చెంనాయుడు ప్రకటించడం సంచలనం సృష్టించింది.
హైదరాబాద్లో సెక్షన్ 8 అమలు చేయాలని, ముఖ్యమంత్రి ఫోన్లనే ట్యాప్ చేస్తున్నారని టిడిపి ఎదురు దాడి ప్రారంభించింది. సెక్షన్ 8 విషయమై పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. హైదరాబాదులో సెక్షన్ 8 సరికాదని అభిప్రాయపడ్డారు.
అయితే, ఈ కేసు తీరు చూస్తుంటే తెర వెనుక ఏదో జరిగిందని విపక్షాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఇద్దరి మధ్య రాజీకుదిరినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ కేసు అనంతరం ఆంధ్ర సిఎం చంద్రబాబు పూర్తిగా విజయవాడకు పరిమితమయ్యారు.
ఆంధ్ర ప్రభుత్వ కార్యాలయాలు పూర్తిగా విజయవాడకు తరలించాలని నిర్ణయించారు. ఉద్యోగులు వ్యతిరేకించినా, విజయవాడ వచ్చి తీరాల్సిందేనని ఆదేశించారు. మేలోనే కార్యాలయాల తరలింపు ప్రారంభమైంది. జూన్ నాటికి కార్యాలయాలను తరలించి కార్యకలాపాలన్నీ విజయవాడ నుంచే కొనసాగించాలని నిర్ణయించారు.
తెలంగాణ సిఎం కెసిఆర్ సైతం పలు సందర్భాల్లో చంద్రబాబు తనకు మంచి మిత్రుడని కితాబివ్వడం గమనార్హం. ఆ తర్వాత అమరావతి రాజధాని శంకుస్థాపనకు కేసీఆర్ను చంద్రబాబు పిలువడం, తాను చేసిన యాగానికి బాబును కేసీఆర్ పిలవడం కూడా జరిగింది.
రాయలసీమకు నష్టం కలిగే విధంగా తెలంగాణ ప్రాజెక్టులు నిర్మిస్తున్నా.. ఓటుకు నోటు కేసు వల్లే చంద్రబాబు కెసిఆర్ను ప్రశ్నించలేకపోతున్నారని వైసిపి ఆరోపిస్తోంది. ఈ కేసు కోసం ఆంధ్ర ప్రయోజనాలను బాబు తాకట్టు పెడుతున్నారని చెబుతోంది. అయితే, పంతాలతో ఇరు రాష్ట్రాల ప్రజలకు ఇబ్బందులు కలిగించకుండా ఇద్దరు స్నేహితులు కావడాన్ని కూడా పలువురు స్వాగతించారు. కేసు దర్యాఫ్తు మాత్రం కొనసాగాలన్నారు.
మొత్తానికి ఓటుకు నోటు కేసు వల్ల ఫోన్ ట్యాపింగ్ను తెరపైకి తెచ్చి టిడిపి తెరాసను చిక్కుల్లో పడేసినప్పటికీ.. అంతిమంగా తెరాసకు లాభం జరిగిందనే వాదనలు ఉన్నాయి. టిడిపి నుంచి 12 మంది ఎమ్మెల్యేలు తెరాసలో చేరడం, తెలంగాణలో టిడిపి దాదాపు ఖాళీ కావడం జరిగింది.