ఓటుకు నోటు: ఆ ఇద్దరు ఎంపీల డొంక కదుల్తుందా, జిమ్మీ కీలకం?
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో తెరపైకి జిమ్మీ వచ్చారు. రూ.50 లక్షలు అతడే తరలించాడని ఏసీబీ అనుమానిస్తున్నట్లుగా తెలుస్తోంది. కుట్రలో అతని పాత్ర ఏమిటి అనే దానిపై అతని నుండి పోలీసులు ఆరా తీయనున్నారు. కుట్రలో కీలకపాత్ర ఉండి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు.
జిమ్మీ ద్వారా ఇద్దరు ఎంపీల జాతకాలు కూడా బయటపడతాయా అనే చర్చ సాగుతోంది. ఓటుకు నోటు కేసులో ఏసీబీ శనివారం నాడు సండ్రకు మరోసారి నోటీసులు జారీ చేసింది. అలాగే రేవంత్ వ్యక్తిగత సిబ్బందికి, జిమ్మీకి నోటీసులు జారీ చేసింది.
జిమ్మీ చంద్రబాబు, నారా లోకేశ్లకు అనుచరుడని నమస్తే తెలంగాణ కథనం ఇచ్చింది. ఎమ్మెల్యే కొనుగోలు కుట్రలో రేవంత్, సెబాస్టియన్, మత్తయ్యతో పాటు జిమ్మీదీ ప్రధాన పాత్రేనని ఏసీబీ దర్యాప్తు అధికారులు భావిస్తున్నారని రాసింది. జిమ్మీ లోకేష్, చంద్రబాబు, బాలకృష్ణ తదితరులతో కలిసిన ఫోటోలు వెలుగులోకి వచ్చాయి.
మత్తయ్య అనంతరం జిమ్మీని రంగంలోకి దించి సెబాస్టియన్, రేవంత్ రెడ్డి ద్వారా కొనుగోలు వ్యవహారం నడిపించి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ కేసులో రేవంత్ రెడ్డి, సెబాస్టియన తర్వాత కీలక ఆధారాలు జిమ్మీ ద్వారానే వెల్లడవుతాయని భావిస్తున్నారు.
కరీంనగర్ జిల్లా రామగుండంకు చెందిన జిమ్మీ గతంలో రామగుండం కార్పొరేటర్ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందాడు. చాలాకాలంగా మల్కాజిగిరిలో ఉంటున్నాడు. ఏసీబీని జిమ్మీని విచారిస్తే డొంక మొత్తం కదులుతుందని చెబుతున్నారు.
స్టీఫెన్ సన్కు గాలం వేయడం నుంచి కుట్రలో అత్యంత కీలకంగా వ్యవహరించింది జిమ్మీయేనని ఏసీబీ దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారని చెబుతున్నారు. స్టీఫెన్ సన్కు రేవంత్ ఇప్పజూపిన రూ.50లక్షలను జిమ్మీయే తీసుకు వచ్చి ఉంటారని అనుమానిస్తున్నారు.
ఒకవేళ డబ్బులు తీసుకువచ్చింది జిమ్మీయేనని విచారణలో తేలితే స్టీఫెన్ సన్కు ఇచ్చేందుకు అగ్రిమెంట్ అయిన మిగతా రూ.4.5కోట్ల సంగతి కూడా ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారని సమాచారం. కాగా, సోమవారం నాడు సండ్ర వెంకట వీరయ్య ఏసీబీ అధికారుల ముందు హాజరు కావాల్సి ఉంది.