రేవంత్ ప్రధాన నిందితుడు, లేని సండ్ర పేరు: అవి నిజమే! మలుపు తిరగనుందా?
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో దర్యాఫ్తు పూర్తి చేశాకమరో ఛార్జీషీటు దాఖలు చేస్తామని ఎసిబి అదనపు ఎస్పీ మల్లారెడ్డి మంగళవారం తెలిపారు. సంచలనం సృష్టించిన ఈ కేసులో ఏసీబీ మొదటి చార్జిషీట్ దాఖలు చేసింది.
39 మంది సాక్షుల వివరాలు, నిందితుల నుంచి సేకరించిన ఆధారాలు, ఫోన్ కాల్ డేటా, ట్రాన్స్స్క్రిప్ట్, ఫోరెన్సిక్ రిపోర్టు వంటి వివరాలను 316 పేజీల్లో, మరో 25 పేజీల్లో దర్యాప్తు సమాచారంతో ఏసీబీ ప్రత్యేక కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు.
ఏసీబీ అదనపు ఎస్పీ మల్లారెడ్డి మంగళవారం ఉదయం ఏసీబీ కోర్టులో చార్జిషీట్ను సమర్పిస్తూ... కేసు ఇంకా దర్యాప్తులో ఉందని, ఇంకొంతమందిపై కేసులు నమోదయ్యే అవకాశముందని, దర్యాప్తు పూర్తిచేసిన తర్వాత మరో చార్జిషీట్ దాఖలు చేస్తామని తెలిపారు.
ప్రస్తుతం ఎఫ్ఐఆర్లో నిందితులుగా పేర్కొన్న నలుగురిపై, ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తుపై చార్జిషీట్ దాఖలు చేసినట్టు మల్లారెడ్డి తెలిపారు. ఇందులో ప్రధాన నిందితుడిగా రేవంత్ రెడ్డిని పేర్కొంది. సెబాస్టియన్, ఉదయ్ సిన్హా, జెరూసలేం మత్తయ్యలను ఇతర నిందితులుగా పేర్కొంది.
అనుబంధ పత్రాలతో కలిపి సుమారు 340కి పైగా పేజీలతో దాఖలు చేసింది. ప్రధాన సాక్షిగా ఎమ్మెల్యే స్టీఫెన్ సన్తోపాటు ఇంటి యజమాని, మధ్యవర్తులుగా ఉన్నవారి పేర్లను పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు దర్యాప్తు పూర్తయినంత మేరకు ఎసిబి అభియోగ పత్రం దాఖలు చేసింది.
ఇందులో ప్రధానంగా రేవంత్ రెడ్డి పాత్రతోపాటు మొదటి విడతలో అరెస్ట్ చేసిన వారి పాత్ర గురించే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పాత్రపై దర్యాప్తు పూర్తికాకపోవడంతో ఆయన పేరును నిందితుల జాబితాలో చేర్చలేదు.
సండ్రను కస్టడీకి తీసుకుని విచారించినప్పటికీ నోట్ల కట్టల మూలాలు తెలుసుకోవాల్సి ఉన్నందున అభియోగ పత్రంలో ఆయన పేరును చేర్చలేదని తెలుస్తోంది. ఈ వ్యవహారంపై దర్యాప్తు పూర్తయ్యాక సండ్రతోపాటు ఇంకెవరైనా కేసులో కీలక పాత్ర పోషిస్తే వారి పేర్లతో మరో ఛార్జీషీట్ దాఖలు చేస్తారు.
ఓటుకు నోటు వ్యవహారంలో రేవంత్ రెడ్డికి ముందు సండ్ర మొత్తం వ్యవహారాన్ని నడిపించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఎసిబి దాఖలు చేసిన అభియోగ పత్రం ప్రస్తుతం కోర్టు పరిశీలనలో ఉంది.
ఎసిబి సమర్పించిన పత్రాలన్నీ సక్రమంగా ఉన్నట్లయితే వాటన్నింటిపై సంతృప్తి చెందాక కోర్టు విచారణ నిమిత్తం ఛార్జీషీట్ను పరిగణనలోకి తీసుకుని నిందితులకు సమన్లు జారీ చేసే అవకాశముంది. ప్రస్తుతం దాఖలు చేసిన ఛార్జీషీట్లో కుట్ర జరిగిన తీరును పేర్కొన్నట్లు తెలుస్తోంది.
మేజిస్ట్రేట్ నమోదు చేసిన స్టీఫెన్ సన్, ఇంటి యజమాని మాల్కం టేలర్, స్టీఫెన్ సన్ కూతురు జెస్సికాల వాంగ్మూలాలను కోర్టుకు సమర్పించింది.
వీటితోపాటు రేవంత్ రెడ్డి అనుచరులు, డ్రైవర్, టిడిపి కార్యకర్తలు పలువురు నుంచి సేకరించిన వాంగ్మూలాలను జతచేసింది. స్టీపెన్ సన్తో రేవంత్ రెడ్డి తదితరులు మాట్లాడుతున్న వ్యవహారంతోపాటు వారి నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్ల నుంచి ఎఫ్ఎస్ఎల్ సేకరించిన సమాచారాన్ని ఇచ్చింది.
ఫోన్ సంభాషణలు కీలకం, ఆడియోలు నిజమైనవే!!
ఓటుకు నోటు కేసులో ఫోన్ సంభాషణలు కీలకంగా మారుతున్నాయి. ఆడియో, వీడియో సంభాషణలను ఫోరెన్సిక్ లేబోరేటరీకి పంపించి పరిశీలించిన విషయం తెలిసిందే.
ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఆధారంగా, ప్రామాణికత కోసం త్వరలో తాము ఇతరులను స్వర ఆధారాలు తీసుకుంటామని ఎసిబి చెబుతోంది. శాంపిల్స్ సేకరించిన తర్వాత మ్యాచింగ్ టెస్ట్ జరుపుతామని ఎసిబి చెబుతోంది. త్వరలో ఎసిబి నోటీసులు జారీ చేసే అవకాశముందని తెలుస్తోంది.