బుర్కాలో యజమాని ఇంటికే కన్నం: సీసీటీవి నడకే పట్టించింది..!
హైదరాబాద్: పనిచేస్తున్న యజమాని ఇంటికే కన్నం వేశాడో ప్రబుద్ధుడు. అంతేకాదు సీసీ కెమెరాలకు దొరకకుండా ఉండేందుకు గాను బుర్కా వేసుకున్నాడు. చివరకు అతడి నడకే పోలీసులకు పట్టించేలా చేసింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్రెడ్డి శుక్రవారం విలేకరులకు వివరించారు.
ఈ నెల 26వ తేదీన లక్డీకాపూల్ ఎక్స్ప్రెస్ అపార్ట్మెంట్, ఎ బ్లాక్లో నివాసముండే శ్రీకాంత్ ఇంట్లో 44 తులాల బంగారం, 30 వేల నగదు చోరీకి గురికావడంతో నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. శ్రీకాంత్ కార్పొరేట్ కార్యాలయాలకు గిఫ్ట్ ఆర్టికల్స్ సరఫరా చేసే వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడు.
అతడి భార్య ప్రభుత్వ ఉద్యోగి. శ్రీకాంత్ తన కార్యాలయాన్ని అదే అపార్ట్మెంట్ ఆవరణలో ఉండే బి-బ్లాక్లో నిర్వహిస్తున్నాడు. 26వ తేదీ ఉదయం 10.30 గంటలకు భార్య, భర్తలిద్దరూ ఇంటికి తాళం వేసి వారి వారి పనుల నిమిత్తం బయటకు వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే గుర్తుతెలియని వ్యక్తులు వారింట్లో దొంగతనానికి పాల్పడ్డారు.
ఆ దొంగతనానికి పాల్పండి ఎవరో కాదు తన వద్ద పని చేసిన వాడేనని తెలియడంతో శ్రీకాంత్ అవాక్కయ్యాడు. తమిళనాడుకు చెందిన ఓంప్రకాష్ అనురాగ్ అలియాస్ హరి కొన్నేళ్ల క్రితం జీవనోపాధి కోసం నగరానికి వచ్చాడు. శివారు ప్రాంతంలోని యాప్రాల్లో నివాసముంటున్నాడు. 2009 నుంచి 2011 వరకు శ్రీకాంత్ వద్ద పనిచేసి మానేశాడు.
తర్వాత నాలుగేళ్ల పాటు సికింద్రాబాద్ ఎస్పీ రోడ్డులోని హోండా షోరూంలో పనిచేశాడు. అక్కడా పని మానేసి తిరిగి 2015 ఫిబ్రవరిలో శ్రీకాంత్ వద్ద పనిలో చేరాడు. విలాసాలు, తాగుడుకు బానిసవ్వడంతో వచ్చే జీతం డబ్బులు సరిపోవడం లేదు. దీంతో తన యజమాని ఇంట్లో చోరీ చేయాలని పథకం వేసుకున్నాడు.
ఇందులో భాగంగా ఈ నెల 7వ తేదీన శ్రీకాంత్ ఇంటి తాళం చెవిని దొంగిలించి, అప్పటి నుంచి కార్యాలయానికి రావడం లేదు. శ్రీకాంత్ సైతం తాళం చెవి పోయిందనుకొని మరో కీని తయారు చేయించాడు. ఈ క్రమంలో 26వ తేదీన దొంగతనం జరిగింది. అపార్టుమెంట్ మొత్తం సీసీ కెమెరాల నిఘాలో ఉన్నాయనే విషయం ఓంప్రకాష్కు తెలుసు.
దీంతో బుర్కా ధరించి దొంగతనం చేయాలని ప్లాన్ వేసుకున్నాడు. 26వ తేదీ సికింద్రాబాద్లో బుర్కా, చేతికి గ్లౌస్లు, మిరపపొడి ప్యాకెట్లు కొనుగోలు చేశాడు. మధ్యాహ్నం బైబుల్ హౌస్ వరకు బైక్పై వచ్చాడు. అక్కడున్న సులభ్ కాంప్లెక్స్లోకి వెళ్లి బుర్కా ధరించాడు.
బుర్కాలో యజమాని ఇంటికే కన్నం: సీసీటీవి నడకే పట్టించింది..!
అక్కడి నుంచి లక్డీకాపూల్ వరకు ఆటోలో వచ్చి, ప్రధాన రోడ్డు నుంచి అపార్టుమెంట్ వరకు చేతిలో ఒక కవరు పట్టుకొని నడుచుకుంటూ వెళ్లాడు. అపార్టుమెంట్లోని శ్రీకాంత్ ఇంట్లోకి వెళ్లి దొంగతనం చేసుకుని తిరిగి బయటకు వచ్చాడు. ఆ సమయంలో ఎవరైన అనుమానించి పట్టుకుంటే వారిపై కారంపొడి చల్లి పరార్కావాలని ప్లాన్ వేసుకున్నాడు. అక్కడి నుంచి తిరిగి బైబుల్ హౌస్ వద్ద ఉండే సులభ్ కాంప్లెక్స్ వరకు ఆటోలో వెళ్లి అక్కడ బుర్కా తీసేశాడు.
బుర్కాలో యజమాని ఇంటికే కన్నం: సీసీటీవి నడకే పట్టించింది..!
ఫిర్యాదు రాగానే పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లగా అక్కడ ఎలాంటి ఆధారాలు దొరకలేదు. దీంతో అపార్టుమెంట్లోని సీసీ కెమెరాల పుటేజీని సేకరించారు. దొంగతనం జరిగిన రోజు బుర్కా వేసుకొని ఒక మహిళ తిరగడం గమనించారు. ఆమె నడక, కాళ్లకు వేసుకున్న షూను క్షుణ్ణంగా పరిశీలించగా అది మగవాడేనని తేలింది.
బుర్కాలో యజమాని ఇంటికే కన్నం: సీసీటీవి నడకే పట్టించింది..!
అతడి కుడి కాలు అడుగు సరిగా పడకుండా, కుంటినట్లు ఉండడంతో ఈ పుటేజీలను అపార్టుమెంట్వాసులు, శ్రీకాంత్ కుటుంబ సభ్యులకు చూపించారు. వారు అలా నడిచే ఓంప్రకాష్పై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది.
బుర్కాలో యజమాని ఇంటికే కన్నం: సీసీటీవి నడకే పట్టించింది..!
గతంలో జరిగిన ప్రమాదంతో కుడికాలుకు శస్త్ర చికిత్స జరగడంతో అతను సరిగ్గా నడువలేడనే విషయం దర్యాప్తులో తేలింది. ఓంప్రకాశ్ను అరెస్ట్ చేసి, 44 తులాల బంగారం, 18 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. సైఫాబాద్ ఏసీపీ సురేందర్రెడ్డి పర్యవేక్షణలో నాంపల్లి ఇన్స్పెక్టర్ మధుమోహన్రెడ్డి బృందం నిందితుడిని 48 గంటల్లో పట్టుకొని, సొత్తును రికవరీ చేయడంతో డీసీపీ వారిని అభినందించారు.