తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు, సంబురాలు(ఫోటో)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డు ఆవిర్భవించింది. ఇందుకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డు-1971 చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం స్వీకరించింది.
ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వికాస్రాజ్ సోమవారం జీవో 21ని విడుదల చేశారు. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లుగా ఇంకో జీవో విడుదల కావాల్సి ఉన్నది. ఈ జీవోకు సంబంధించిన అన్ని పనులూ పూర్తయ్యాయి.
దీంతో ఇక నుంచి తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ బాధ్యతలు ఈ బోర్డు నిర్వహిస్తుంది. ఆస్తులు, సిబ్బంది పంపకాలతో పాటు భవనాలు, వాహనాలు, ఫర్నిచర్, ఫ్లోర్లువంటి వాటి విభజనకు సంబంధించిన ముందస్తు పనులన్నీ పూర్తయ్యాయి.
ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డు ఆవిర్భావంపై సోమవారం జీవో విడుదల కావడంతో ఇంటర్ బోర్డులో ఆనందోత్సవాలు నెలకొన్నాయి. ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు మధుసూధన్రెడ్డి, ఇంటర్మీడియట్ బోర్డు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ఇంటర్ బోర్డులో పెద్ద ఎత్తన సంబురాలు జరుపుకున్నారు.
తెలంగాణ ఇంటర్ బోర్డు ఆవిర్భావం సంతోషం కలిగిస్తున్నదని ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి తెలిపారు. తెలంగాణలో ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించేందుకు తాము సిద్దంగా ఉన్నామని ఇంటర్ బోర్డు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు.
తెలంగాణ ఇంటర్ బోర్డు ఏర్పాటుపై ప్రభుత్వ ప్రిన్సిపాళ్ళ సంఘం, లైబ్రేరియన్ల సంఘం, నాన్ టీచింగ్ ఉద్యోగస్తుల సంఘం రాష్ట్ర నాయకులు హర్షం వ్యక్తంచేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు, విద్యాశాఖ మంత్రి జగదీశ్రెడ్డికి ఇంటర్ విద్య జేఏసీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.