అన్ని రాష్ట్రాలు సమానమే, తెలంగాణకు చేయూతనిస్తాం: వెంకయ్య
నెల్లూరు: కేంద్ర ప్రభుత్వానికి అన్ని రాష్ర్టాలు సమానమేనని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కూడా చేయూతను ఇస్తుందని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు శనివారం నాడు చెప్పారు. ఆయన ఎస్పీఎస్ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మాట్లాడారు.
ఏపీకి కేంద్రం నుంచి చాలా సాయం అందిందని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా కంటే మెరుగైన సాయం చేయాలని యోచిస్తున్నామన్నారు. తెలుగువారికి అన్యాయం జరగకూడదన్నది తమ ఉద్దేశమన్నారు.
వైసిపి, కాంగ్రెస్ తదితర పార్టీలు ఏపీకీ ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తున్న విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ... కేవలం ప్రత్యేక హోదా వల్ల రాష్ర్టాల సమస్యలు పూర్తిగా తీరుతాయన్న భరోసా ఏమీ లేదన్నారు. ఇప్పటి వరకు దేశంలో పదకొండు రాష్ర్టాలకు ప్రత్యేక హోదా ఉన్నదని అయినప్పటికీ అవి ఇంకా పేదరికంలోనే ఉన్నాయన్నారు.
కాబట్టి ప్రత్యేక హోదాకు మించి రాష్ర్టాలకు సాయం చేయాలని కేంద్రం భావిస్తోందన్నారు. ఉమ్మడి రాష్ట్ర పునర్విభజన చట్టంపై పార్లమెంటులో చర్చ సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటించారు. ఆ విషయాన్ని గుర్తు చేస్తూ ఏపీలో ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి.
స్వచ్ఛ భారత్ ప్రజా ఉద్యమంగా సాగాలి: వెంకయ్య
స్వచ్ఛ భారత్ ప్రజా ఉద్యమంగా రూపొందాలని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తెలిపారు. జాతి, కుల, మత, వర్గ, వర్ణ, భాష, ప్రాంతాలకతీతంగా స్వచ్ఛభారత్ను ప్రజలంతా చేపట్టాలన్నారు. దీనిని ప్రజలంతా బాధ్యతగా స్వీకరించాలన్నారు.
ప్రధాని మోడీ భారత్ను సుసంపన్నం చేసేందుకు కంకణం కట్టుకున్నారని, అందుకే దేశ విదేశాల పర్యటనల ద్వారా పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారన్నారు. అలా అభివృద్ధిని అందరికీ పంచుతున్నారన్నారు. స్వచ్ఛ భారత్ అంటే పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడమే కాదని, మనసులను కూడా నిర్మలంగా ఉంచుకోవాలన్నారు. అలా ఉంటే పరిసరాలు కూడా శుభ్రంగా ఉంటాయన్నారు.