సీఎం మాటకు, చేతకు పొంతనే లేదు: విరుచుకుపడిన చాడ
ముఖ్యమంత్రి కేసీఆర్ మాటకు, చేతకు పొంతనలేదని, ఎన్నిక ముందు ఇచ్చిన అనేక హామీలను అమలుపరచ్చడంలో విఫమయ్యారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆరోపించారు.
కరీంనగర్: ముఖ్యమంత్రి కేసీఆర్ మాటకు, చేతకు పొంతనలేదని, ఎన్నిక ముందు ఇచ్చిన అనేక హామీలను అమలుపరచ్చడంలో విఫమయ్యారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. శుక్రవారం స్థానిక బద్దం ఎల్లారెడ్డి భవన్లో జరిగిన సీపీఐ జిల్లా కార్యవర్గ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరై చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలు మరచి, తన మాటల గారడితో రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతున్నాడని విమర్శించారు.
అభివృద్ధిలో రాష్ట్రం ముందుందని పదేపదే చేస్తున్న ప్రజకటనను తప్పు పట్టారు. అభివృద్ధి అంటే ముఖ్యమంత్రి కుటుంబం అభివృద్ధికాదని, ప్రజల అభివృద్ధి చెందాలని, పేద బతుకుల్లో మార్పు కనపడాలన్నారు. రాష్ట్రంలో చేపట్టిన అనేక ప్రాజెక్టు పూర్తి కావడం లేదని, రీడిజైన్ పేరుతో కాలయాపన చేస్తున్న ప్రభుత్వం.. ప్రజాధనాన్ని పెద్ద ఎత్తున దుర్వినియోగం చేస్తున్నదని విమర్శించారు.
ప్రాజెక్టు కింద భూములు కోల్పోతున్న రైతుకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం కాకుండా పరిహారం అందించాలనే నిర్ణయం సరికాదన్నారు. 2013 భూసేకరణ చట్టాన్ని పక్కన పెట్టిన ప్రభుత్వం అందరూ వ్యతిరేకిస్తున్నప్పటికీ 2016లో ఈ చట్టాన్ని సవరించడానికి పూనుకోవడం వల్ల రైతు భూముపై హక్కు కోల్పోయే ప్రమాదం ఏర్పడిందన్నారు.
ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలను కోర్టు తప్పుపట్టినప్పటికీ, పాలకుల ఆలోచనా విధానంలో మార్పు రావడం లేదన్నారు. దళితులకు 3ఎకరాల భూ పంపిణీ పథకం అటకెక్కిందని, అట్టహాసంగా ప్రకటించిన ఈ పథకంలో కొందరికి మాత్రమే భూముల పంపిణీ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుందన్నారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కోమటిరెడ్డి రాంగోపాల్రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యుడు కూన శోభారాణి, పానగంటి కేదారి, అందె స్వామి తదితరులు పాల్గొన్నారు.