హైదరాబాదులో ఆగని చైన్ స్నాచింగ్లు: వరంగల్కు పాకాయి
హైదరాబాద్: నగరంలో చైన్ స్నాచింగ్లు చేసే ముఠాను పట్టుకున్నామని శుక్రవారం ఓ వైపు హైదరాబాదు పోలీసు కమిషనర్ శుక్రవారం వెల్లడించగా, తాజాగా శనివారంనాడు చైన్ స్నాచింగ్ సంఘటనలు జరిగాయి. హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురంలోని హైకోర్టు కాలనీలో ఇంటి ముందు ఉన్న ఓ మహిళ మెడలో నుంచి నాలుగు తులాల బంగారు గొలుసును గుర్తుతెలియని దొంగలు అపహరించుకువెళ్లారు.
చైన్ స్నాచింగ్ ఘటనలు వరంగల్కు కూడా పాకాయి. వరంగల్ జిల్లాలో వరుసగా 4 రోజుల్లో 8 గొలుసు దొంగతనాలు జరిగాయి. శనివారం ఒక్కరోజే మూడు చోట్ల గొలుసు దొంగతనాలు చోటు చేసుకున్నాయి. కేయూ, పోచమ్మ మైదాన్, కాజీపేటలో మహిళల మెడల్లోంచి దొంగలు బంగారు గొలుసులను అపహరించారు. గొలుసు దొంగతనాలపై పోలీసులు కేసులు నమోదు చేసుకున్నారు. దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఇదిలావుంటే, ఓ చైన్స్నాచర్ను హైదరాబాదులోని కేపీహెచ్బీ పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి మూడు లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీస్స్టేషన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ సంజీవరావు, సీఐ శ్రీకాంత్గౌడ్ వివరాలను వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లా కాశిపాడు గ్రామానికి చెందిన బొక్క చింతారావు నిజాంపేటలో ఉంటున్నాడు.
గతంలో కారు డ్రైవర్గా పనిచేశాడు. సొంతూరిలో ఉంటూనే డబ్బు అవసరం వచ్చిన సమయంలో నగరానికి వచ్చి స్నాచింగ్లుచేసి ఊరెళ్లిపోయేవాడు. కేపీహెచ్బీలో నాలుగు, మియాపూర్లో ఒకటి, సనత్నగర్లో ఒకటి, దుండిగల్ పరిధిలో ఒక స్నాచింగ్ చేసి తప్పించుకు తిరుగుతున్నాడు.
వరుస స్నాచింగ్లు జరగడంతో తనిఖీలు చేపట్టిన పోలీసులకు రైతుబజార్ వెనుక రోడ్డులో అనుమానాస్పదంగా సంచరిస్తుండగా అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. చైన్ స్నాచింగ్లు చేసినట్టు అంగీకరించాడు. చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్కు తరలించారు.