రాష్ట్రపతికి గవర్నర్ విందు: కెసిఆర్ దూరం, చంద్రబాబు హాజరు
హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గౌరవార్థం గవర్నర్ నరసింహన్ రాజభవన్లో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు జ్వరంతో బాధపడుతున్నారు. దాంతో ఆయన రావడం లేదని సమాచారం.
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ చక్రపాణి హాజరయ్యారు. హైదరాబాద్లోని రాష్ట్రపతి నిలయంలో ఉండడానికి వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గౌరవార్థం విందు ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కృష్ణారావు కూడా వచ్చారు.
రాష్ట్రపతికి గవర్నర్ ఇచ్చిన విందుకు పలువులు ఐఎఎస్, ఐపిఎస్ అధికారులు కూడా హాజరయ్యారు. గవర్నర్ నరసింహన్ ఒక్కొక్కరిని రాష్ట్రపతికి పరిచయం చేశారు. అంతకు ముందు రాష్ట్రపతికి గవర్నర్ దంపతులు స్వాగతం పలికారు.
మంగళవారం ఉదయం నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ స్వల్పంగా జ్వరంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఆయన అపాయింట్మెంట్లన్నీ రద్దు చేసుకున్నారు. అయితే, నోటుకు ఓటు కేసు ప్రాధాన్యం దృష్ట్యా ఎసిబి డిజి ఎకె ఖాన్తో సమావేశమయ్యారు.