పరిశ్రమలపై కుట్ర, పగ సాధింపు: బాబుపై ఈటెల
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మంగళవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు తెలంగాణకు పరిశ్రమలు రాకుండా అడ్డుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణకు రావాల్సిన విద్యుత్ వాటాను అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు.
చంద్రబాబు మెడలు వంచి విద్యుత్లో వాటాను దక్కించుకుంటామన్నారు. శ్రీశైలంలో విద్యుత్ ఆపాలని చంద్రబాబు లేఖ రాయడం ఏం నీతి అని ప్రశ్నించారు. చంద్రబాబు లేఖ పైన ఆయన తాబేదార్లు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దీపావళి తర్వాత రైతులకు విద్యుత్ విషయంలో ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు.
శ్రీశైలంలో, నాగార్జున సాగర్లో విద్యుత్ ఉత్పత్తి ఆపివేయాలని ఏపీ ప్రభుత్వం కోరడం అత్యంత దారుణమన్నారు. విద్యుత్ కొరతతో తెలంగాణ రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే చంద్రబాబుకు బాధ కలగడం లేదా? అని ప్రశ్నించారు. ఏపీలోని రైతులు రెండు పంటలను పండించుకుని మూడో పంటకు సిద్ధమవుతున్నారని, తెలంగాణ రైతులు ఒక్క పంటను కూడా పండించుకోకూడదా? అన్నారు.
శ్రీశైలంలో నిబంధనలకు లోబడే విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నామన్నారు. శ్రీశైలంలో ప్రస్తుత నీటిమట్టం 860 అడుగులు ఉందని, జీవో 69 ప్రకారం 832 అడుగుల నీటి మట్టం వరకు విద్యుత్తును ఉత్పత్తి చేసుకోవచ్చన్నారు. చంద్రబాబు ఆలోచన వెనుక భారీ కుట్ర దాగుందన్నారు.
తెలంగాణలోని పంటలను ఎండబెట్టి, రాష్ట్రాన్ని దెబ్బతీయడానికే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. రైతుల మృతదేహాలపై చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారన్నారు. 2019లో తెలంగాణలో అధికారంలోకి రావాలనే లక్ష్యంతోనే చంద్రబాబు ఇలాంటి పనులు చేస్తున్నారని, ఇక్కడి ప్రభుత్వాన్ని అస్తవ్యస్థం చేయాలని చూస్తున్నారని, ఇంత భయంకరమైన కుట్రలు అవసరమా అన్నారు.
తెలంగాణ రైతుల పైన చంద్రబాబు పగ సాధిస్తున్నారన్నారు. విభజన సమయంలో రాసుకున్నట్లు తెలంగాణకు 54 శాతం కరెంట్ ఇవ్వాలన్నారు. నీళ్లు, కరెంట్ అన్నింట్లో చంద్రబాబు తెలంగాణకు ద్రోహం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. పీపీపీఏల రద్దు నుండి అన్నింటా కుట్రలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు.
విభజన సమయంలో రాసుకున్న అగ్రిమెంట్లు ఆంధ్రాబాబు కాలరాశాడన్నారు. తెలంగాణ టీడీపీ నేతలను చరిత్ర క్షమించదన్నారు. తెలంగాణలో 166 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంటే 143 మిలియన్ యూనిట్లు మాత్రమే సరఫరా చేస్తున్నామన్నారు. తెలంగాణ టీడీపీ నేతలు అనవసరంగా బురద జల్లవద్దన్నారు. నవంబర్ నెలలో అసెంబ్లీ సమావేశాలు ఉంటాయని చెప్పారు.