టీ రైతులకు బాబు ఇచ్చిన డబ్బులే: తలసాని ఫైర్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పైన తెలంగాణ రాష్ట్ర సమితి నేత, సనత్ నగర్ శాసన సభ్యుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ మరోమారు మండిపడ్డారు. చంద్రబాబు ఓ అబద్ధాలకోరు అన్నారు. ఏనాడూ మాట మీద నిలబడ్డ వ్యక్తి కాదన్నారు.
రాజ్యసభ టికెట్లు ఇవ్వడంలో, ఎమ్మెల్సీ అవకాశాలు కల్పించడంలో చంద్రబాబుది అంతా వ్యాపారమే అంటూ విమర్శించారు. కొంతమంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎవరెవరి దగ్గర ఎంతెంత డబ్బు గుంజారన్న జాబితా తన వద్ద ఉందన్నారు. సొంత పార్టీ ఎంపీని కూడా వారు వదల్లేదని ఆరోపించారు. ఈ వివరాలను సమయం వచ్చినప్పుడు బయటపెడతానన్నారు. బ్లాక్ మెయిల్ చేసే వారి కనుసన్నల్లో ఆ పార్టీ నడుస్తోందన్నారు.
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వ్యాపార కేంద్రంగా మారిందన్నారు. తెలంగాణ టీడీపీ నేతలు రూ.5 లక్షల చొప్పున చందాలు వేసుకొని ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు డబ్బులు ఇచ్చామని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు ఇచ్చిన డబ్బులను పంచారన్నారు. వ్యాపారస్తులను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. తన కొడుకును మేయర్ గా చేసేందుకు తాను తెరాసలో చేరాననే వార్తలు అవాస్తవమన్నారు.
చంద్రబాబు తన కొడుకును దొడ్డిదారిన రాజకీయాల్లోకి తెచ్చారని, అలాంటి ఆలోచన తనకు లేదన్నారు. చంద్రబాబు తీరు నచ్చకే పార్టీని వీడానని చెప్పారు. కేసీఆర్ టీడీపీలో ఉన్నప్పుడు ఆయనను చంద్రబాబు తక్కువగా అంచనా వేశారని, ఇప్పుడు ఆయన ఏమిటో తెలుస్తోందన్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు పెట్టడం విడ్డూరమన్నారు.
మోత్కుపల్లి దీక్ష
శంషాబాద్ ఎయిర్ పోర్టులో దేశీయ టెర్మినల్కు ఎన్టీఆర్ పేరు తొలగిసతే సహించే ప్రసక్తి లేదని టీడీపీ నేత ఎర్రబెల్లి అన్నారు. దేశీయ టెర్మినల్కు ఎన్టీఆర్ పేరు తొలగించాలని తెలంగాణ శాసన సభ తీర్మానానికి నిరసనగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు దీక్ష చేపట్టారు.
సంఘీభావం తెలిపిన ఎర్రబెల్లి మాట్లాడారు. రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్కు వ్యతిరేకంగా కేసీఆర్, జానా రెడ్డి, జీవన్ రెడ్డి మాట్లాడటం బాధాకరమన్నారు. దేశీయ టెర్మినల్కు ఎన్టీఆర్ పేరు కొనసాగించాలని డిమాండ్ చేశారు.
ఎన్టీఆర్ ఘాట్ వద్ద శనివారం ఉదయం నిరసన దీక్ష చేపట్టిన మోత్కుపల్లి మాట్లాడుతూ.. శంషాబాద్ ఎయిర్టుకు ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం దురదృష్టకరం, బాధాకరమన్నారు. కేసీఆర్ సిద్దాంతం లేని మనిషని విమర్శించారు. తెలంగాణ సమస్యలను అర్థం చేసుకున్న మహానేత ఎన్టీఆర్ అని కొనియాడారు.
తెలంగాణ ప్రజలను స్వతంత్రులుగా మార్చిన ఘనత ఎన్టీఆర్దే అని అన్నారు. తెలంగాణలో ఉద్యోగులకు న్యాయం చేయడానికి ఎన్టీఆర్ 610 జీవో తీసుకువచ్చారని ఆయన వివరించారు. తెలంగాణలో పటేల్, పట్వారీ వ్యవస్థను ఎన్టీఆర్ రద్దు చేశారని మోత్కుపల్లి నర్సింహులు వెల్లడించారు.ఈ దీక్షా శిబిరానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వచ్చి మోత్కుపల్లి దీక్షకు సంఘీభావం తెలియజేశారు.