చట్టం తన పని తాను: ట్యాపింగ్పై చంద్రబాబు, 'ఆత్మరక్షణలో కెసిఆర్'
విజయవాడ: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం అన్నట్లుగా తెలుస్తోంది. విజయవాడలో కేబినెట్ సమావేశం జరిగింది. ఇందులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా చర్చకు వచ్చిందని తెలుస్తోంది.
దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రస్తుతం న్యాయస్థానం పరిధిలో ఉందని చెప్పారు. ఇందులో చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన వారితో వ్యాఖ్యానించారు.
ట్యాపింగ్పై కెసిఆర్ ఆత్మరక్షణలో పడ్డారు: రమణ
ట్యాపింగ్ విషయమై తెలంగాణ ప్రభుత్వం తడబడుతోందని, ఆత్మరక్షణలో పడిందని తెలంగాణ టిడిపి అధ్యక్షులు ఎల్ రమణ శుక్రవారం అన్నారు. ఈ వ్యవహారంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆరే తప్పు చేశారని అర్థమవుతోందన్నారు.
తాము ఎవరి ఫోన్లను ట్యాప్ చేయలేదంటూ గతంలో టీఆర్ఎస్ నేతలంతా చెప్పారని, ఇప్పుడేమంటారని ప్రశ్నించారు. కోర్టులోనే ఒప్పుకున్నారని ట్యాపింగ్ చేసినట్లు ఒప్పుకున్నారన్నారు. మే 23వ తేదీ నుంచే టీడీపీ నేతల ఫోన్లు ట్యాప్ అయ్యాయని ఆరోపించారు.
కాల్ డేటా ఇవ్వరాదంటూ తెలంగాణ ప్రభుత్వం ఎందుకు వాదిస్తోందని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తాను తవ్వుకున్న గోతిలో తానే పడిందన్నారు. కెసిఆర్ మూల్యం చెల్లించక తప్పదన్నారు.
చట్ట విరుద్ధంగా ట్యాపింగ్కు పాల్పడి, తెలంగాణ గౌరవాన్ని ప్రభుత్వం మంటగలిపిందని ఎర్రబెల్లి దయాకర రావు మండిపడ్డారు. కేసీఆర్ తన పదవికి రాజీనామా చేయాలన్నారు. ట్యాపింగ్ వల్ల తెలంగాణకు పెట్టుబడులు రావడం లేదన్నారు. ఇప్పటికీ వివిధ పార్టీల నేతల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని ఆరోపించారు.