అందరూ అమరావతికి రండి: తెలంగాణ నేతలకు బాబు, హైద్రాబాద్లో గెలుస్తాం: రమణ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులను ఆహ్వానించారు. ఈ నెల 22న జరిగే శంకుస్థాపనకు రావాలని చంద్రబాబునా ఆహ్వానించారు.
మొత్తం తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయని, దసరా పర్వదినం రోజు ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా శంకుస్థాపన జరుగుతుందని చెప్పారు. తెలంగాణ కమిటీలోని ప్రతి ఒక్కరినీ ఆహ్వానిస్తున్నట్టు చంద్రబాబు తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లూ చేస్తున్నామన్నారు. చరిత్రలో నిలిచిపోయేలా ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. శంకుస్థాపనకు రావాలని భావించేవారు సాధ్యమైనంత ముందుగా నిర్వాహకులకు సమాచారం ఇస్తే, వసతి ఏర్పాట్లను చూసుకుంటారని చెప్పారు.
మచ్చలేని నాయకుడు: ఎల్ రమణ
ప్రజా జీవితంలో మచ్చలేని మనిషిగా చంద్రబాబు ఉన్నారని తెలంగాణ టిడిపి అధ్యక్షులు ఎల్ రమణ అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో నూతన కమిటీ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతుల కోసం వెయ్యి కిలోమీటర్ల పాదయాత్ర చేసిన ధైర్యశాలి అన్నారు.
టిడిపి సిద్ధాంతాలు, ఆశయాల కోసం కార్యకర్తలు కృషి చేయాలన్నారు. హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలలో టిడిపి జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు పార్టీ తరఫున భరోసా కల్పించామని ఎల్ రమణ చెప్పారు.