మోసగాళ్లకు మోసగాళ్లు! నిరుద్యోగుల పాలిట యముళ్లు!!
ఉద్యోగాల పేరుతో భారీగా మోసాలకు పాల్పడిన ఢిల్లీ గ్యాంగ్ నాయకుడు కూడా చివరికి తన అనుచరుడి చేతిలో మోసపోయిన ఉదంతమిది.
హైదరాబాద్: జాబ్ పోర్టల్స్ నుంచి నిరుద్యోగుల డేటాను కొనుగోలు చేస్తూ స్థానికంగా ఉద్యోగాల పేరుతో భారీగా మోసాలకు పాల్పడిన ఢిల్లీ గ్యాంగ్ నాయకుడు కూడా చివరికి తన అనుచరుడి చేతిలో మోసపోయిన ఉదంతమిది. ఇతడికి బోగస్ వివరాలతో తెరిచిన బ్యాంకు ఖాతాలు సమకూర్చిన ఓ బిహారీ రూ.30 లక్షలు కాజేసి చివరికి అతడికే శఠగోపం పెట్టాడు. దీంతో కంగుతిన్న సదరు చీటర్ 'పేటీఎం' మార్గం ఎంచుకున్నాడు.
వివరాల్లోకి వెళ్తే... న్యూఢిల్లీలోని సుభాష్ నగర్ కు చెందిన విజయ్ మాన్ బీటెక్ పూర్తి చేశాక కొన్నాళ్లపాటు ఓ కాల్ సెంటర్ లో నెలకు రూ.10 వేల జీతానికి పని చేశాడు. నిరుద్యోగులకు ఉద్యోగాల పేరుతో కాల్స్ చేయడం, వారి డబ్బు డిపాజిట్ చేయించుకోవడం ఈ కాల్ సెంటర్ దందా.
ఓ మూణ్ణెళ్లు దాని కార్యకలాపాలను అధ్యయనం చేసిన విజయ్ మాన్ తానే స్వయంగా అలాంటి సంస్థను ఏర్పాటు చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. న్యూఢిల్లీలోని కీర్తినగర్ లో ఓ ప్లగ్ అండ్ ప్లే కార్యాలయాన్ని అద్దెకు తీసుకుని.. ఈ-మీడియా వెబ్ టెక్నాలజీస్ పేరుతో సంస్థను ఏర్పాటు చేశాడు. ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ కు చెందిన అభిషేక్ సింగ్ ను మేనేజర్ గా నియమించుకున్నాడు. ఇంటర్మీడియెట్, డిగ్రీ డ్రాపవుట్స్ ను టెలీకాలర్లుగా నియమించుకుని వారి ద్వారానే కథ నడిపాడు.
వివిధ జాబ్ పోర్టల్స్ లో నిరుద్యోగులు అప్ లోడ్ చేసిన బయోడేటాలను దళారుల ద్వారా కొని వాటిలోని వివరాల ఆధారంగా అయా నిరుద్యోగులకు.. టెలీకాలర్లతో ఫోన్లు చేయించి ఉద్యోగాల ఆశ చూపి, ఆసక్తి చూపిన వారికి వివిధ రకాల రుసుముల పేర్లు చెప్పి డబ్బు డిమాండ్ చేసేవాడు.
ఈ నగదు నేరుగా తన ఖాతాల్లో డిపాజిట్ చేయించుకుంటే తేలిగ్గా దొరికిపోతామనే ఉద్దేశంతో బోగస్ బ్యాంకు ఖాతాలు అందించే వారికోసం అన్వేషించాడు. బీహార్ కు చెందిన హరీందర్ కుమార్ ఇలాంటి ఖాతాలు అందించడంలో దిట్ట. ఇతడు బోగస్ ఖాతాల్లో నిరుద్యోగులు డిపాజిట్ చేసిన డబ్బును డ్రా చేసి... అందులో 20 శాతం కమీషన్ తాను తీసుకుని మిగిలిన డబ్బును విజయ్ మాన్ కు అందించేవాడు.
నవంబర్ నెలలో పెద్ద నోట్లు రద్దు చేయడం, నగదు ఉపసంహరణపై పరిమితి విధించడం వల్ల డబ్బు డ్రా చేయడం ఇబ్బందిగా మారిందని, వీలుచూసుకుని డ్రా చేసుకు వస్తానని చెప్పిన హరీందర్ కుమార్ చివరికి ఆయా ఖాతాల్లో నిరుద్యోగ యువకులు డిపాజిట్ చేసిన డబ్బు రూ.30 లక్షలు అయ్యే వరకు ఎదురుచూసి.. ఆపైన ఆ డబ్బును డ్రా చేసుకుని పత్తా లేకుండా పోయాడు.
దీంతో కంగుతిన్న విజయ్ మాన్ తన పంథా మార్చాడు. బోగస్ ఖాతాలు అందించిన వారి నుంచి డెబిట్ కార్డులు తానే తీసుకోవడం మొదలెట్టాడు. నిరుద్యోగుల నుంచి డిపాజిట్ అయిన డబ్బును అతడే డ్రా చేసి బోగస్ ఖాతాదారులకు కమీషన్ తానే ఇవ్వసాగాడు. రెండు నెలలుగా 'పేటీఎం' ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు.
పేటీఎం యాప్ డౌన్లోడ్ చేసే ఫోన్లలోనూ బోగస్ వివరాలతో తీసుకున్న ప్రీపెయిడ్ సిమ్ కార్డులు వేస్తున్నాడు. చివరికి వీళ్ల పాపం పండింది. సైబర్ క్రైమ్ ఏసీపీ కేసీఎస్ రఘువీర్ ఆదేశాల మేరకు ఇన్ స్పెక్టర్ పి.రవికిరణ్ నేతృత్వంలోని బృందం చాకచక్యంగా విజయ్ మాన్, అభిషేక్ లను పట్టుకుంది. వాస్తవానికి రూ.1.13 లక్షల మోసం కేసులో వీరిని అరెస్టుచేయగా.. మరో రూ.70 వేల మోసం కేసు సైతం వీరిపై సైబర్ క్రైమ్ ఠాణాలో ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది.