రసాభాసగా 'మన మద్రాస్ కోసం': తోపులాట, తొక్కిసలాట! (ఫోటోలు)
హైదరాబాద్: భారీవర్షాలు, వరదలతో అతలాకుతలమైన చెన్నై వాసులకు అండగా నిలిచేందుకు తెలుగు సినీ తారలు ఆదివారం కూకట్పల్లి సుజనా ఫోరం మాల్లో ఏర్పాటు చేసిన 'మన మద్రాస్ కోసం' విరాళాల సేకరణ కార్యక్రమం రసాభాసగా మారింది.
పెద్దసంఖ్యలో తరలివచ్చిన అభిమానులతో ఫోరం మాల్ కిక్కిరిసిపోయి తొక్కిసలాటకు దారితీసింది. సీనీతారలు కాజల్, రానా, అల్లరి నరేష్, నిఖిల్, మంచు లక్ష్మి, తేజశ్వి తదితరులకు చేదు అనుభవం ఎదురైంది.
సినీ తారలు వస్తున్నారని విషయం తెలుసకున్న అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వారిని దగ్గరగా చూడటానికి, సెల్ ఫోన్లలో ఫోటోలు తీసేందుకు సభా వేదిక వద్దకు హీరో, హీరోయిన్లను తాకేందుకు అభిమానులు చొచ్చుకు రావడంతో ఒక్కసారిగా తొక్కిసలాటకు దారి తీసింది.
దీంతో పలువురు అభిమానులు కిందపడిపోయారు. కార్యక్రమ నిర్వాహాకులు, పోలీసులు, బౌన్సర్లు అభిమానులను కట్టడి చేసేందుకు యత్నించినప్పటికీ ఫలితం లేకపోవడంతో సినీతారలు తమ కార్యక్రమాన్ని అర్ధాంతరంగా ముగించుకుని వెళ్లిపోయారు.
చెన్నై వరద బాధితులను ఆదుకునేందుకు ప్రతీ ఒక్కరూ ముందుకు రావాలని సినీ తారలు కాజల్, అల్లరి నరేష్, రానా, మంచులక్ష్మి, తేజస్విలు కోరారు. సాయంత్రం రామానాయుడు స్డూడియోలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నటుడు అల్లు అర్జున్ మాట్లాడారు.
తమిళనాడులో మునుపెన్నడూ లేని విధంగా వర్షాలు, వరదలు ముంచెత్తి చెన్నై నగరం నీటమునిగిందని, అక్కడి ప్రజలలో తెలుగువారు కూడా ఉన్నారని, ప్రజలను ఆదుకునేందుకు మనమంతా సహకారం అందించాల్సిన అవసరం ఉందన్నారు.