సాయుధ పోరాటయోధుడు, మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రాజేశ్వరరావు కన్నుమూత
కరీంనగర్: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు సిరిసిల్ల మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రాజేశ్వర్రావు (93) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజేశ్వరరావు తెల్లవారుజామున 4 గంటలకు సోమాజీగూడ యశోదా ఆస్పత్రిలో కన్నుమూసినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్రావుకు ఈయన స్వయన సోదరుడు. రాజేశ్వరరావు కుమారుడు రమేష్ ప్రస్తుత వేములవాడ ఎమ్మెల్యేగా ఉన్నారు. రాజేశ్వరరావు ఆరు సార్లు ఎమ్మెల్యే గెలిశారు. 1957లో మొదటిసారి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు.
సిరిసిల్ల నియోజకవర్గం నుంచి ఐదు సార్లు, మెట్పల్లి నుంచి ఓ సారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈయన స్వస్థలం కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం మారుపాక గ్రామం. రాజేశ్వరరావు రాజకీయ జీవితం సీపీఐ పార్టీతో ప్రారంభమైంది.
సీపీఐ జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా సేవలందించారు. 1999లో టీడీపీలో చేరారు. ఆ తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. 2004 తర్వాత క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఉమ్మడి ఆంధ్రపదేశ్ శాసనసభలో ఎన్టీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు.
విద్యార్థి దశ నుంచి నిజాంకు వ్యతిరేకంగా పోరాడారు. నిజాం వ్యతిరేక పోరాటంలో జైలు జీవితం అనుభవించారు. మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావుతోపాటు ఆర్థిక నిపుణులు చెన్నమనేని హన్మంతరావు ఆయనకు సోదరులు. చెన్నమనేని రాజేశ్వరావు తెలంగాణ స్వతంత్ర సమరయోధుల సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు.
రాజేశ్వరరావు మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. మంత్రులు హరీశ్ రావు, కెటిఆర్, ఈటెల రాజేందర్, కడియం శ్రీహరి, లక్ష్మారెడ్డి, ఎంపీ కవితలు సంతాపం తెలిపారు. రాజేశ్వరరావు మృతి పట్ల పలువురు రాజకీయ పార్టీల నాయకులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
జగన్ సంతాపం
ఆరుసార్లు ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించిన కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రాజేశ్వరరావు మృతి పట్ల వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విలువలకు కట్టుబడ్డ వ్యక్తిగా చెన్నమనేనిని జగన్ అభివర్ణించారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో మచ్చలేని నేతగా చెన్నమనేని రాణించారని ఈ సందర్భంగా జగన్ నివాళులర్పించారు.