తిరుమలలో కిందపడిపోయిన మంత్రి పోచారం: ఆస్పత్రిలో చేరిక
తిరుమలలో తెలంగాణ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అస్వస్థతకు గురయ్యారు. శ్రీవారి దర్శనానంతరం అతిథిగృహానికి చేరుకున్న ఆయనకు ఛాతిలో నొప్పి రావడంతో.. వెంటనే ఆయన్ను స్థానిక అశ్వని వైద్యశాలకు తరలించారు.
తిరుమల: తిరుమలలో తెలంగాణ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అస్వస్థతకు గురయ్యారు. శ్రీవారి దర్శనానంతరం అతిథిగృహానికి చేరుకున్న ఆయనకు ఛాతిలో నొప్పి వచ్చి కిందపడిపోవడంతో.. వెంటనే ఆయన్ను స్థానిక అశ్వని వైద్యశాలకు తరలించారు.
వివరాల్లోకి వెళితే.. శ్రీవారి దర్శనం అనంతరం ఆయన మణి మంజరి అతిథి గృహానికి చేరుకున్నారు. అయితే, ఆ అతిథి గృహంలో కేసీఆర్ ఉండటంతో ఆయన్ని కలిసేందుకు వెళ్తున్న సమయంలో పోచారం స్పృహ తప్పి పడిపోయినట్లు సమాచారం. దీంతో, వెంటనే స్పందించిన టీటీడీ సిబ్బంది స్థానిక అశ్విని ఆసుపత్రికి ఆయన్ని తరలించారు.
ఐసీయూలో ఆయనకు చికిత్సను అందిస్తున్నారు. ఛాతినొప్పి, లో బీపీ కారణంగానే ఆయన అస్వస్థతకు గురయ్యారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. పోచారానికి అందిస్తున్న వైద్యసేవలను జేఈవో శ్రీనివాసరాజు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఆసుపత్రి వద్దకు మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మొక్కులు చెల్లించుకునేందుకు బుధవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్న విషయం తెలిసిందే. సీఎం దంపతులతోపాటు పోచారంతోపాటు పలువురు తెలంగాణ మంత్రులు, అధికారులు కూడా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు.