భారీ వర్షం: కేసీఆర్ నిజామాబాద్ పర్యటన రద్దు
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ నిజామాబాద్ జిల్లా పర్యటన రద్దైంది. ఆదివారం నిజామాబాద్ జిల్లాలోని పర్యటనకు వెళ్లనున్న సీఎం కేసీఆర్ బాన్సువాడ నియోజకవర్గంలో పర్యటించాల్సి ఉంది. బీర్కూరు మండలం తిమ్మాపురంలోని వెంకన్న ఆలయంలో జరిగే విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి సీఎం హాజరుకావాల్సి ఉంది.
సీఎం కేసీఆర్ పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే నిజామాబాద్ జిల్లాలో ఆదివారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తూనే ఉంది. దీంతో వాతావరణంలో ఒక్కసారిగా పెను మార్పులు చోటు చేసుకున్నాయి. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో హెలికాప్టర్ ప్రయాణానికి ఏటీసీ అనుమతి నిరాకరించింది.
దీంతో ముఖ్యమంత్రి నిజామాబాద్ పర్యటనను విరమించుకోవాలని భద్రతా సిబ్బంది, ఇంటిలిజెన్స్ వర్గాలు కేసీఆర్కు సూచించాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ తన పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. తొలుత నగరంలోనే సీఎం కేసీఆర్ పర్యటన ఖరారైంది.
ఎల్బీనగర్ నియోజకవర్గంలోని నాగోల్ పరిధిలో పలు మురికివాడలను ముఖ్యమంత్రి సందర్శించనున్నట్లు అధికారులు తెలిపారు. కానీ బడ్జెట్ రూపకల్పనలో సీఎం బిజీగా ఉండటంతో కేవలం బాన్సువాడ పర్యటనకు మాత్రమే ఖరారైంది. అయితే వర్షం కారణంగా అది కూడా రద్దైంది.