ఓ బాలుడి కల మరో బాలుడి పాలిట శాపం: కత్తితో గొంతు కోసి హత్య
హైదరాబాద్: ఖరీదైన బైక్ కొనుక్కోవాలనుకున్న ఓ బాలుడి కల మరో బాలుడి పాలిట శాపమైంంది. తనతో పాటు ఆడుకునే బాలుడిని కిడ్నాప్ చేసి డబ్బులు సంపాదించవచ్చనే తన ఆలోచన చివరకు అతడిని హత్య చేసేవరకు వెళ్లింది. రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయం వెలుగు చూసింది.
గత నెల 17న కరీంనగర్లో అదృశ్యమై ఆపై హత్యకు గురైన బాలుడు లక్ష్మీప్రసాద్ కేసులో మిస్టరీ వీడింది. లక్ష్మీప్రసాద్ను తోటి స్నేహితుడే హత్య చేసినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. వివరాల్లోకి వెళితే కరీంనగర్లోని కశ్మీర్గడ్డ ప్రాంతానికి చెందిన ఒర్సు కుమారస్వామి కాంట్రాక్టర్. అతడికి ఇద్దరు కుమారులు అనిల్, లక్ష్మీప్రసాద్.
లక్ష్మీప్రసాద్ ఇంటి సమీపంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. కుమారస్వామి జనవరి 17న శబరిమల వెళ్లగా అదేరోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో అతని కుమారుడు లక్ష్మీప్రసాద్ కిడ్నాప్ అయ్యాడు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో భగత్నగర్లోని ఓ కాయిన్బాక్స్ నుంచి బాలుడి తల్లికి ఫోన్ చేసి ‘మీ కొడుకును కిడ్నాప్ చేశాం రూ.5 లక్షలు ఇవ్వకపోతే చంపేస్తాం' అని బెదిరింపుకాల్ వచ్చింది.
దీంతో తమ కుమారుడు కిడ్నాప్ అయ్యాడని తెలుసుకున్న కుమారస్వామి భార్య, బంధువులు నగరంలోని టూ టౌన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న సీఐ హరిప్రసాద్, ఎస్సై దామోదర్రెడ్డి, ఏఎస్సై శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా జనవరి 22న మానేరు డ్యాం వద్ద బైపాస్రోడ్డులో కుళ్లిపోయిన స్థితిలో లక్ష్మీప్రసాద్ మృతదేహం లభ్యమైంది.
చొక్కా ఆధారంగా కుళ్లిపోయిన మృతదేహాం లక్ష్మీ ప్రసాద్గా తల్లిదండ్రులు గుర్తించారు. దీంతో పోలీసులు తమ విచారణను వేగవంతం చేసి హత్యకు గల కారణాలను విచారణలో వెల్లడించారు. కుమారస్వామి బంధువు అయిన ఓ బాలుడు(17) వీరి కుటుంబంతో చనువుగా ఉంటూ పిల్లలతో ఆడుకుంటుండేవాడు.
గతంలో ఓసారి ఆ బాలుడు చోరీ చేయడంతో మందలించి వదిలేశారు. ఈ బాలుడికి షార్ట్ఫిల్మ్లు తీయాలని ఓ కలగా ఉండేది. తెలిసినవారితో ఎప్పుడూ షార్ట్ఫిల్మ్లు, ఖరీదైన బైక్ల గురించే మాట్లాడేవాడు. అందుకు చాలా డబ్బులు కావాల్సి ఉండటంతో బాలుడి కన్ను లక్ష్మీప్రసాద్ కుటుంబంపై పడింది.
చిన్నారిని కిడ్నాప్ చేస్తే సులభంగా డబ్బు వస్తుందని భావించి జనవరి 17న ఉదయం ఇంటి ఎదుట ఒంటరిగా ఆడుకుంటున్న లక్ష్మీప్రసాద్ను తన బైక్పై ఎక్కించుకుని వారి బంధువుల ఇంటికి వెళ్లాడు. లక్ష్మీప్రసాద్ ఆకలిగా ఉందనడంతో అన్నం తినిపించాడు. అక్కడనుంచి తాడు, ప్లాస్టర్ తీసుకుని లక్ష్మీప్రసాద్ను మానేరు డ్యాం బైపాస్రోడ్డులోని చెట్లపొదల్లోకి తీసుకెళ్లాడు.
లక్ష్మీప్రసాద్ నోటికి ప్లాస్టర్ వేసేందుకు ప్రయత్నింగా అతడు బిగ్గరగా అరవడంతో గొంతు గట్టిగా నొక్కిపట్టాడు. దీంతో ఊపిరి ఆగిపోయింది. ఆ తర్వాత అప్పటికే తన వెంట తెచ్చుకున్న కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. లక్ష్మీప్రసాద్ చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత ఇంటికి వచ్చి కాయిన్బాక్స్ నుంచి మృతుడి తల్లికి ఫోన్ చేసి కిడ్నాప్ చేశామని చెప్పాడు.
లక్ష్మీప్రసాద్ కనిపించడం లేదని తల్లి ఆరా తీయడంతో అందరూ కలిసి బాలుడికోసం వెతకడం ప్రారంభించారు. పోలీసులు రంగంలోకి దిగడంతో మళ్లీ కాయిన్బాక్స్ వద్దకు వెళ్లేందుకు వీలుకాక భయపడిపోయాడు. పోలీసులు పలు కోణాల్లో విచారణ చేపట్టగా లక్ష్మీప్రసాద్తో రోజూ ఆడుకునే సదరు బాలుడిపై అనుమానం కలిగింది. అతడిని విచారించగా హత్య చేసినట్లు తేలింది. నిందితుడు మైనర్ కావడంతో జువైనల్ కోర్టుకు హాజరుపరిచారు.