కర్ణాటక చర్చి పేలుళ్లు: 16ఏళ్లకు నల్గొండలో ఉగ్రవాది అమీర్ అలీ అరెస్ట్
హైదరాబాద్: 2000 సంవత్సరంలో కర్ణాటకలోని చర్చి వద్ద జరిగిన వరుస పేలుళ్లు కేసుకు సంబంధించి కీలక నిందితుడైన షేక్ అమర్ అలీ అలియాస్ అమీర్ అలీని బెంగుళూరు పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. నిషేధిత ఉగ్రవాద సంస్ధ అయిన దీన్దార్ అంజుమాన్లో అమీల్ అలీ పని చేస్తున్నాడు.
నల్గొండ జిల్లాలో నివాసం ఉంటున్న ఉగ్రవాది షేక్ అమీర్ అలీని కర్ణాటకకు చందిన సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. దీంతో నల్గొండ జిల్లలో మరోసారి ఉగ్రవాద జాడలు బయటపడ్డాయి. నిషేధిత ఉగ్రవాద సంస్ధ దీన్దార్ అంజుమాన్లో సభ్యుడిగా కొనసాగుతున్న అమీర్ అలీ గత 16 ఏళ్లుగా తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో నివాసం ఉంటున్నాడు.
నల్గొండ జిల్లాలో ఇతను ఉన్నట్లు పక్కా సమాచారం అందడంతో కర్ణాటక సీఐడీ అధికారులు తెలంగాణ పోలీసులతో కలిసి వెళ్లి అరెస్టు చేశారు. కర్ణాటకలోని చర్చిలో వరుస పేలుళ్ల కేసుకు సంబంధించిన నిందితుల కోసం సీఐడీ అధికారులు గాలిస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు ఈరోజు పోలీసుల చేతికి చిక్కాడు.
కృష్ణా జిల్లాకు చెందిన షేక్ అమీర్ అలీ గత 16 ఏళ్లుగా అజ్ఞాతంలోనే ఉన్నాడు. వివరాల్లోకి వెళితే... 2000 సంవత్సరంలో జూన్ నుంచి జులై మధ్య కాలంలో బెంగుళూరు, హుబ్లీ, కళబుర్గి ప్రాంతాల్లో మూడు బాంబు పేలుళ్లు సంభవించాయి.
జూన్ 8న కళబుర్గిలోని వాడి ప్రాంతంలో ఉన్న సెయింట్ ఆన్స్ చర్చిలో రెండు బాంబులు పేలాయి. జులై 8న హుబ్లీలోని సెయింట్ జాన్స్ లూథరన్ చర్చిలో మరో బాంబు పేలుడు సంభవించింది. ఆ మరసటి రోజైన జులై 9న బెంగుళూరులోని జేజే నగర్లో ఉన్న సెయింట్ పీటర్ పాల్ చర్చిలో బాంబు పేలుడు జరిగింది. ఈ బాంబు పేలుళ్లకు సంబంధించి 12 మంది నిందితులుగా గుర్తించారు.
ఈ కేసును అనంతరం కర్ణాటక సీఐడీకి అప్పగించారు. దీంతో రంగంలోకి దిగిన కర్ణాటక సీఐడీ అధికారులు దర్యాప్తులో భాగంగా 16 ఏళ్లు తర్వాత ఓ కీలక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా కర్ణాటకలోని క్రిస్టియన్లు, హిందులపై దీన్దార్ అంజుమాన్ సంస్ధ సభ్యులు కోపం పెంచుకునే ఈ బాంబు దాడులకు పాల్పడ్డారని వెల్లడైంది.
ఈ బాంబు పేలుళ్ల ఘటన తర్వాత హిందువులను నిందిస్తూ పలువురు కరపత్రాలను కూడా ముద్రించారు. అయితే దర్యాప్తులో క్రిస్టియన్లు, హిందువులకు మధ్య వివాదాలు సృష్టించేందుకే దీన్దార్ అంజుమాన్ సంస్ధ ఈ పేలుళ్లకు పాల్పడ్డారన్న వాస్తవం వెల్లడైంది. కర్ణాటక మాదిరే ఏపీ, మహారాష్ట్రలో కూడా పేలుళ్లు జరపాలని పథకం రచించారని అప్పట్లో మీడియాలో వార్తలు వచ్చాయి.