బస్సు ఎక్కుతూ సీఐడీ ఇన్స్పెక్టర్ దుర్మరణం
హైదరాబాద్: కదులుతున్న బస్సు ఎక్కబోయి ప్రమాదవశాత్తూ ముందు చక్రం కింద పడిన ఓ సీఐడీ ఇన్స్పెక్టర్ దుర్మరణం చెందారు. మారేడుపల్లి ఇన్స్పెక్టర్ రవీంద్ర రెడ్డి కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం అయ్యగారిపేటకు చెందిన తిరుపతి రావు వరంగల్ రేంజీలో 1991లో ఎస్సైగా చేరారు.
కరీంనగర్ టౌన్ ఇన్సుపెక్టర్గా విధులు నిర్వర్తించిన ఆయన ఇటీవలె నగరంలోని సీఐడీ విభాగానికి బదలీ అయ్యారు. బుధవారం విధులు ముగించుకున్న తర్వాత అతను కరీంనగర్లోని తన ఇంటికి వెళ్లేందుకు జేబీఎస్ వెళ్లారు. కరీంనగర్ డిపోకు చెందిన బస్సు ప్లాట్ ఫారం పైకి వస్తుండగా తిరుపతి రావు బస్సు ముందు ద్వారం నుండి ఎక్కేందుకు ప్రయత్నించారు.
దీంతో అతను ప్రమాదవశాత్తూ కిందపడి అక్కడికి అక్కడే మృతి చెందాడు. మహంకాలీ ఏసీపీ తిరుపతి, మారేడుపల్లి ఇన్సుపెక్టర్ రవీంద్ర రెడ్డిలు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకొని, దర్యాఫ్తు చేస్తున్నారు. డ్రైవర్ సాదిగ్ పరారీలో ఉన్నారు. మృతుడి వయస్సు 45.
రైలు కిందపడి డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
రైలు కిందపడి ఓ డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతపురం జిల్లాకు చెందిన బాలకృష్ణ (20) పెద్ద అంబర్పేటలోని నారాయణ ఐఏఎస్ అకాడమీలో డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు.
బుధవారం రాత్రి సమయంలో కాచిగూడ రైల్వేస్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ లింగన్న తెలిపారు.