సినీ ప్రియులకు షాకింగ్ న్యూస్.. టికెట్ల ధరలు భారీగా పెంపు
రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరలు భారీగా పెరిగాయి. ఏసీ థియేటర్లో రూ.70 ఉన్న గరిష్ఠ టికెట్టు ధర ఒక్కసారిగా రూ.120కి చేరింది. తాజా ధరల్ని వర్తింపజేస్తూ రెండ్రోజుల క్రితమే హోంశాఖ ఉత్తర్వులిచ్చింది.
హైదరాబాద్: రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరలు భారీగా పెరిగాయి. ఏసీ థియేటర్లో రూ.70 ఉన్న గరిష్ఠ టికెట్టు ధర ఒక్కసారిగా రూ.120కి చేరింది. తాజా ధరల్ని వర్తింపజేస్తూ రెండ్రోజుల క్రితమే హోంశాఖ ఉత్తర్వులిచ్చింది.
ప్రభుత్వం నియమించిన ఆరుగురు సభ్యుల కమిటీ ఇచ్చిన సిఫారసుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. మల్లీప్లెక్స్లు మినహా మిగతా సినిమాహాళ్లకు వీటిని వర్తింపజేశారు. చాలా థియేటర్ల నిర్వాహకులు శుక్రవారం నుంచే ఈ ధరలను వసూలు చేస్తున్నారు.
థియేటర్లలో సీట్ల శ్రేణిని బట్టి తాజాగా పేర్కొన్న గరిష్ఠ, కనిష్ఠ ధరల మధ్య టికెట్ల ఖరీదును నిర్ణయించుకునే అధికారం యాజమాన్యాలకు ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నిర్వహణ ఖర్చులు, వినోద పన్ను, జీఎస్టీ వంటివన్నీ ఇందులోనే కలిసి ఉంటాయి.
సినిమా హాలును ఆధునికీకరించే సందర్భాల్లో ఇప్పుడు నిర్ధారించిన ధరలను ఏసీకైతే రూ.3-7, నాన్-ఏసీకైతే రూ.2-5 మధ్య పెంచుకోవచ్చు. మల్టీప్లెక్స్లలో ఒక్కో టికెట్టుపై రూ.50 పెంపును వర్తింపజేశారు.
ఆయా శ్రేణులను బట్టి టికెట్టు ధరలు రూ.200-300 మధ్యే ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే తెరకు ముందుండే రెండు పంక్తుల సీట్లకు గరిష్ఠ ధరలో 20% కన్నా తక్కువగా వసూలు చేయాలని స్పష్టం చేశారు.