అధికారంలోకి రాగానే వడ్డీతోసహా తీర్చుకొంటాం: టిఆర్ఎస్ కు కాంగ్రెస్ వార్నింగ్
అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా తీర్చుకొంటామని కాంగ్రెస్ పార్టీ నాయకులు టిఆర్ఎస్ ను హెచ్చరించారు.
హైదరాబాద్:అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా తీర్చుకొంటామని కాంగ్రెస్ పార్టీ నాయకులు టిఆర్ఎస్ ను హెచ్చరించారు.ల్గొండలో బత్తాయి మార్కెట్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్ళి నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై టిఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయడాన్ని సిఎల్ పి తీవ్రంగా ఖండించింది.
నల్గొండలో సిఎల్పీ ఉపనాయకుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై టిఆర్ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడడాన్ని సిఎల్ పీ సమావేశం తీవ్రంగా ఖండించింది. గురువారంనాడు హైద్రాబాద్ లో సిఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా నల్గొండ ఘటనపై చర్చించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులపై అధికారపార్టీ ఏ రకంగా వ్యవహరిస్తోందనే విషయమై చర్చించారు. అధికారపార్టీని నిలువరించేందుకు ప్రత్యేక వ్యూహాన్ని అనుసరించాలని సిఎల్పీ సమావేశంలో చర్చించారు.
అధికారపార్టీ అనుసరిస్తున్న తీరును ఎండగట్టేందుకుగాను ఈ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలని సిఎల్పీ భావిస్తోంది.అంతేకాదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మనోధైర్యం కల్పించేందుకుగాను పార్టీ కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయం తీసుకొంది.
వడ్డీతో సహాతో వడ్డిస్తాం
తాము అధికారంలోకి రాగానే టిఆర్ఎస్ నాయకులకు వడ్డీతో సహా వడ్డిస్తామని పిసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి టిఆర్ఎస్ నాయకులను హెచ్చరించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్రాన్ని తన జాగీరు అనుకొంటున్నారని ఆయన విమర్శించారు. కెసిఆర్ కు వ్యతిరేకంగా 66 శాతం మంది ఓట్లు వేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారాయన.ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోబోమని చెప్పారు. ఎమ్మెల్యేపై దాడి ఘటనను సుమోటోగా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారాయన.పోలీసులకు ఎలా సమాధానం చెప్పాలో తమకు తెలుసునని ఉత్తమ్ చెప్పారు.
బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలి
నల్గొండ ఘటనలో భాద్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని సిఎల్పీ నాయకుడు జానారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇది ప్రభుత్వం కార్యక్రమం. టిఆర్ఎస్ కార్యక్రమం కాదన్నారు.అంతేకాదు ఈ కార్యక్రమానికి మీరేందుకు వచ్చారని పోలీసులు అడగడం విడ్డూరంగా ఉందన్నారు.అంతేకాదు ఎమ్మెల్యే వెంకట్ రెడ్డిని 5 గంటలపాటు నిర్భంధించడం సరికాదన్నారు. కార్యకర్తల కోసం అవసరమైతే జైలుకు వెళ్తానని చెప్పారు జానారెడ్డి.నకిరేకల్ ఎమ్మేల్యే వేముల వీరేశం సతీమణి టిఆర్ఎస్ కార్యకర్తలను రెచ్చగొడుతున్నట్టు ఉన్న ఫోటోను చూపుతూ ఎవరు ఎవరిని రెచ్చగొట్టారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.కొట్టకేం చేస్తారని పోలీసులు ఎమ్మెల్యేను ఉద్దేశించి వ్యాఖ్యానించడం సరైందికాదన్నారు జానారెడ్డి.
ప్రజలు తిరగబడితే అధోగతే
ప్రజలు తిరగబడితే టిఆర్ఎస్ కు అధోగతేనని శాసనమండలిలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు షబ్బీర్ అలీ చెప్పారు. తెలంగాణ రాష్ట్రం కోసం మంత్రి పదవిని వదిలిపెట్టుకొన్న ఎమ్మెల్యే వెంకట్ రెడ్డిపై దాడికి పాల్పడడం సరైందికాదన్నారు.
లొంగకపోతే చంపేందుకు ప్రయత్నిస్తున్నారు.
టిఆర్ఎస్ కు లొంగకపోతే చంపేందుకు ప్రయత్నిస్తున్నారని సిఎల్పీ ఉపనాయకుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. అంతేకాదు తనకు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం నుండి ప్రాణహాని ఉందని చెప్పినా తనకు రక్షణ కల్పించలేదని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు.