నిన్న గవర్నర్కు, నేడు రాష్ట్రపతికి కేసీఆర్ పాదాభివందనం: భుజం తట్టిన ప్రణబ్
హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమవారం నాడు పాదాభివందనం చేశారు. ప్రణబ్ దక్షిణ భారత విడిది కోసం మధ్యాహ్నం హైదరాబాదుకు చేరుకున్నారు.
హకీంపేట విమానాశ్రయంలో రాష్ట్రపతికి సీఎం కేసీఆర్, గవర్నర్ నరసింహన్ తదితరులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఆయనకు పాదాభివందనం చేశారు. పదిరోజుల పాటు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ప్రణబ్ ఉంటారు.
ప్రణబ్ ముఖర్జీ హైదరాబాద్ మధ్యాహ్నం చేరుకున్నారు. రాష్ట్రపతికి హకీంపేట విమానాశ్రయంలో స్వాగతం పలికిన వారిలో సీఎం కేసీఆర్, గవర్నర్ నరసింహన్తో పాటు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, స్పీకర్ మధుసూదనా చారి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శ రాజీవ్శర్మ, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు ఉన్నారు.
యాదగిరి గుట్టలో జులై 3న నిర్వహించనున్న హరితహారం ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్రపతిని సీఎం కేసీఆర్ ఆహ్వానించారు.
కాగా, గవర్నర్ నల్లటి బంద్ గలా సూటూలో రాగా, కేసీఆర్ తెల్ల ప్యాంటు, తెల్ల షర్టుతో వచ్చారు. కేసీఆర్ తలవంచి పాదాభివందనం చేయగా, రాష్ట్రపతి భుజం తట్టి ఆశీర్వదించారు. లేచిన తర్వాత రెండు చేతులూ జోడించి ప్రణబ్కి నమస్కారం చేశారు. కాగా, కొద్ది రోజుల క్రితం గవర్నర్కు కేసీఆర్ పాదాభివందనం చేసిన విషయం తెలిసిందే.