జూన్ 2న 'గుడ్ న్యూస్' చెప్పబోతున్న సీఎం కేసీఆర్..
హైదరాబాద్ : తెలంగాణ సర్కార్ మీద గంపెడాశ పెట్టుకున్న కాంట్రాక్టు ఉద్యోగుల కల త్వరలోనే సాకారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం.. తెలంగాణ ద్వితీయ ఆవిర్భావ వేడుకలు జరగబోయే జూన్ 2 సందర్భంగా కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజ్ కి సంబంధించిన ప్రకటన చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.
ఈ మేరకు నోటిఫికేషన్, రూల్ ఆఫ్ రిజర్వేషన్స్, ప్రాతిపదికన నియమితులైన 100 మంది కాంట్రాక్టు ఉద్యోగులకు జూన్ 2వ తేదీన రెగ్యులరైజ్ ఉత్తర్వులు అందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్టుగా సమాచారం. ఇందుకోసం ఇప్పటికే ప్రభుత్వ పరిధిలోని ఆయా శాఖల్లో పనిచేస్తున్న 100 మంది కాంట్రాక్టు ఉద్యోగుల వివరాలను అధికారులు సేకరించినట్టుగా తెలుస్తోంది.
అయితే ఈ రెగ్యులరైజేషన్ ను ఆవిర్భావ వేడుకలకే పరిమితం చేయకుండా.. మొత్తం 2 లేదా 3 దఫాల్లో మొత్తం 18వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించాలనే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. కాగా ఇందులో కీలకంగా మారనున్న కటాఫ్ తేదీ పరిధిపై ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.
2014 జూన్ 2వ తేదీ నాటికి ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న కాంట్రాక్టు ఉద్యోగులకు ముందు దశలో రెగ్యులరైజ్ అవకాశం ఇచ్చి మిగతావారిని తర్వాతి దశల్లో రెగ్యలరైజ్ చేయాలనేది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజ్ ప్రక్రియ గతంలోనే జరగాల్సి ఉన్నా.. ఆయా శాఖల నుంచి ఉద్యోగుల జాబితా అందించడంలో జాప్యం జరుగుతుండడంతో రెగ్యులరైజేషన్ వాయిదా పడుతూ వస్తోంది.
ప్రస్తుతం ఏయే శాఖల్లో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి.. రిజర్వేషన్ల కేటగిరీ పరంగా ఏ స్థాయి పోస్టులు ఎన్ని ఖాళీగా ఉన్నాయనే వివరాలను ప్రభుత్వ అధికారులు ఇప్పటికే సేకరించే పనిలో ఉండగా, దీనికి సంబంధించిన జాబితాను అధికారులు త్వరలోనే సిద్దం చేయనున్నట్టు సమాచారం. ఏదేమైనా సీఎం కేసీఆర్ నిర్ణయం కాంట్రాక్టు ఉద్యోగులకు వరంగా మారనుంది.