ఎప్పుడూ ముందు ఆయన మాట్లాడేవారు.. తరువాత నేను, ఇప్పుడు బాధగా ఉంది - సీఎం కేసీఆర్
టీఆర్ఎస్ 16వ ఆవిర్భావ సభా వేదికపై ‘ఓరుగల్లు పోరుగల్లు’ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్ తొలుత ఆచార్య జయశంకర్ ను గుర్తు చేసుకున్నారు.
వరంగల్: టీఆర్ఎస్ 16వ ఆవిర్భావ సభా వేదికపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆచార్య జయశంకర్ ను గుర్తు చేసుకున్నారు. ఓరుగల్లు పోరుగల్లు అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన ఆయన ఇదే మైదానంలో గతంలో ఉద్యమ సమయంలో ఎన్నోసార్లు తామిరువురం మాట్లడుకున్నామంటూ వ్యాఖ్యానించారు.
గతంలో జరిగిన అన్ని సభల్లో ఆచార్య జయశంకర్ సార్ ముందు మాట్లాడేవారని.. ఆ తర్వాత తాను మాట్లాడేవాడినని, ఇప్పుడు ఆయన ఇక్కడ లేరు. ఎంతో బాధాకరం. ఆయన స్వర్గం నుంచి చూస్తున్నారు. జయశంకర్సార్ అమర్ రహే.. అంటూ కేసీఆర్ బాధగా చెప్పారు.
తమ పార్టీ 16 వసంతాలు ముగించుకుందని, పార్టీ పెట్టిన కొత్తలో ఉంటదా? ఊడుద్దా? అని ఎంతోమంది ఎన్నో రకాలుగా మాట్లాడేవారని, అయినా సరే నిరాశపడకుండా పార్టీని ముందుండి నడిపించడమే కాక.. తెలంగాణ సాధించి, దిగ్విజయంగా మూడేళ్ల పరిపాలన కూడా పూర్త చేసుకున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
రాష్ట్రాన్ని సాధించి తొలి గమ్యాన్ని ముద్దాడామని, అందరి ముఖాల్లో చిరునవ్వులు చూస్తున్న నేపథ్యంలో ఈ మహాసభ నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. పార్టీ స్థాపించిన దగ్గరినుంచి, తెలుంగాణ ఉద్యమ సాధన, ప్రభుత్వ ఏర్పాటు.. ఇలా ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నామని, ప్రతి సందర్భంలోనూ పార్టీ కార్యకర్తలు ఎంతో అండగా నిలిచారని, నేడు తమ ప్రభుత్వం సాధించిన కీర్తి ప్రతిష్టలు గులాబీ శ్రేణులదేనని అన్నారు.
ఎవరినీ విస్మరించకుండా అందరి సంక్షేమం కోసం పనిచేస్తున్నామని, తెలంగాణ వచ్చిన కొత్తలో ఎక్కడ చూసినా సమస్యలే ఉండేవని, ప్రజలు అవస్థలు పడేవారని సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. అధికారంలోకి వచ్చిన ఆర్నెల్లలోనే కరెంటు సమస్యను తీర్చామని చెప్పారు.
పిడికెడు మందితో ప్రారంభమైన టీఆర్ఎస్ 70 లక్షల మంది సభ్యత్వంతో దేశంలోనే ప్రబల రాజకీయ శక్తిగా ఎదిగిందని అంటూ 2019లో కూడా బ్రహ్మాండమైన విజయం సాధించి బంగారు తెలంగాణను సాకారం చేసుకుందామని, తన చివరి రక్తపు బొట్టు వరకు తెలంగాణ వ్యతిరేక శక్తులపై పోరాడతానని, ప్రజాసేవకే పునరంకితమవుతానని ఉద్ఘాటించిన కేసిఆర్ చివర్లో.. 'సెలవ్' అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.