చివరి ప్రయత్నం: సిగ్గుగా ఉందని గవర్నర్కు వినతిపత్రం, కేసీఆర్ సమీక్ష
హైదరాబాద్: తలసాని శ్రీనివాస్ యాదవ్ విషయంలో పదే పదే గవర్నర్కు ఫిర్యాదు చేయడం తమకే సిగ్గుగా ఉందని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు తెలిపారు. గురువారం సాయంత్రం రాజ్ భవన్లో తెలంగాణ టీడీపీ నేతలు గవర్నర్ నరసింహాన్ను కలిసి వినతిపత్రం అందజేశారు.
గవర్నర్ సంతకంతోనే తలసాని మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారని పేర్కొన్నారు. సాధ్యమైనంత త్వరగా తలసానిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని గవర్నర్ను కోరారు. దీనికి సంబంధించిన ఆధారాలను గవర్నర్కు ఇచ్చారు.
మరోవైపు కృష్ణానదిపై కర్ణాటక అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాలను అడ్డుకునేలా కేంద్రంపై ఒత్తడి తీసుకువాలని గవర్నర్ నరసింహాన్ను కోరారు. కర్ణాటక అక్రమ ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం చూసీచూడనట్లుగా వ్వవహరిస్తోందని గవర్నర్కు ఫిర్యాదు చేశారు.
కర్ణాటకలోని ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచితే తెలుగు రాష్ట్రాలు ఎడారిగా మారుతాయన్నారు. జూరాల, నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టు్ల్లో నీటిమట్టం తగ్గిపోయిందని విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి అక్రమ ప్రాజెక్టులను ఆపేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ను కలిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ విధానాలన్నీ కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూరేలా ఉన్నాయని ఆరోపించారు.
కేసీఆర్ సమీక్ష
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంపై గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో డబుల్ బెడ్రూం ఇళ్లు, గ్రామజ్యోతిపై చర్చించారు. 590 చదరపు అడుగుల్లో డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించాలని నిర్ణయించారు.
ఇక జిల్లాల్లో 5 లక్షల 4 వేలతో ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు. వరంగల్, మహబూబ్నగర్ జిల్లాల్లో మొదటి దశలో ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు. ఇక హైదరాబాద్లో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లోని పేదలకు వెయ్యికి పైగా ఇళ్లను నిర్మించనున్నారు.
హైదరాబాద్లో ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.7 లక్షల 4 వేలు వ్యయం కానున్నట్టు తెలిపారు. హైదరాబాద్లో ఎక్కడైతే ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో అక్కడే ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు. దీంతో హైదరాబాద్లో మరోసారి ఇళ్ల క్రమబద్దీకరణ చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం మహమూద్ ఆలీ, హోం మంత్రి నాయిని నర్సింహరెడ్డితోపాటు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.