సన్నగా ఉన్నాను: కేసీఆర్, నిజమే చెప్పరు: షబ్బీర్
హైదరాబాద్: తాను, మంత్రి ఈటెల రాజేందర్ సన్నగా ఉన్నామని, అందుకే తాము సన్న బియ్యం ఇస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మంగళవారం శాసన సభలో చమత్కరించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు దొడ్డుగా ఉన్నారు కాబట్టి వారు దొడ్డుబియ్యమిచ్చారన్నారు.
అంగన్వాడీలకు కూడా సన్నబియ్యం ఇస్తామని చెప్పారు. అక్రమంగా ఇళ్లు పొందిన వారి ముక్కుపిండి వసూలు చేస్తామన్నారు. గత ప్రభుత్వాలు దళితులకు భూములు ఇచ్చినప్పటికీ వారికి తాము నీటి వసతులు కల్పిస్తామని చెప్పారు. సీలేరులో విద్యుత్ వాటా కోసం అందరం కలిసి పోరాడాలన్నారు.
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద ఉన్న నిధులన్నీ ఖర్చు చేస్తామని చెప్పారు. మంచి నీటి కోసం రూ.260 కోట్లు ఇస్తున్నట్లు చెప్పారు. దళితుల భూమి కొనుగోలుపై అపోహలు వద్దన్నారు. తల్లిదండ్రులను చూసుకొని ప్రభుత్వ ఉద్యోగుల లిస్ట్ ఇస్తే.. వారి ముక్కుపిండి డబ్బులు ఇప్పించుదామని చెప్పారు.
ఉర్దూ విద్యాసంస్థల్లో ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారు. మైనార్టీ విద్యార్థులకు ప్రీమెట్రిక్ స్కాలర్ షిప్లు ఇస్తామన్నారు. రూ.9.60 కోట్లతో నిజామియా వర్సిటీలో ఆడిటోరియం నిర్మిస్తామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దర్గాలకు పూర్వవైభవం తెస్తామన్నారు. ఇంటర్నేషనల్ లెవల్లో హజ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు.
రాష్ట్రంలో వర్షపాతం తక్కువగా ఉండటం వల్ల పాక్షిక కరువు ఉందన్నారు. దళిత సంక్షేమ శాఖ తన దగ్గరే పెట్టుకున్నట్లు కేసీఆర్ తెలిపారు. కాంగ్రెస్ హయాంలో వారికి భూములు ఇచ్చారు గానీ... కుంటలు ఇచ్చారని, సకల వసతులతో 3 ఎకరాల కమతం ఇవ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.
తెలంగాణ పేద రాష్ట్రం కాదు: ఈటెల
తెలంగాణ రాష్ట్రం పేద రాష్ట్రం కాదని ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. రైతుల ఆత్మహత్యలకు కారణం ఎవరో చెప్పాలని అన్నారు. గేదెలు, గొర్రెల కొనుగోలుకు రుణాలు ఇస్తామని చెప్పారు. చెరువులకు నిలయం తెలంగాణ రాష్ట్రం అన్నారు. చెరువు కన్నతల్లి వంటిదని, సమైక్య రాష్ట్ర పాలనలో చెరువులను ధ్వంసం చేశారని, అప్పట్లో 60శాతం గొలుసుకట్టు చెరువులతో సాగు జరిగేదని ఆయన తెలిపారు.
ఎస్సీల బతుకులు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయన్నారు. తండాలను గ్రామపంచాయతీలు చేయబోతున్నామని, సేవాలాల్ మహారాజ్ ఉత్సవాలను రూ.కోటితో ప్రభుత్వం తరఫున చేశామన్నారు. రాష్ట్రంలో నూటికి 85 శాతం వెనుకబడిన తరగతుల వారున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీల కంటే కూడా వెనుకబడిన సంచార జాతులవారున్నారని, నూటికి 75శాతం మంది బీసీలు వ్యవసాయంపై ఆధారపడుతున్నారన్నారు.
కేసీఆర్ కోరిక మేరకైతే భద్రాచలం ఏపీకి వెళ్లేది: షబ్బీర్ అలీ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కోరిక మేరకు అయితే భద్రాచలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లేదని కాంగ్రెస్ పార్టీ శాసన మండలి సభ్యుడు షబ్బీర్ అలీ మండలిలో అన్నారు. కేసీఆర్ ఎప్పుడు కూడా అబద్దాలే చెబుతారని ఎద్దేవా చేశారు.