ఎన్డీయేకే మద్దతు: బహిర్గతమైన సీఎం కేసీఆర్ అంతరంగం
హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సత్సంబంధాలు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అది అవసరం కూడా. అదే సమయంలో రాజకీయాలకు వచ్చేసరికి ఆయా పార్టీలు, రాష్ట్రాలు, జాతీయ స్థాయి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం సంప్రదాయంగా వస్తున్నది.
తెలంగాణ అందుకు మినహాయింపేమీ కాదు. 16 ఏళ్ల క్రితం 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావంతో మొదలైన రెండోదశ రాష్ట్ర సాధన పోరాటం 2014లో ముగిసింది. తెలంగాణ తొలి సీఎంగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బాధ్యతలు చేపట్టడంతోపాటు ఒకింత ప్రజా రంజకంగా పాలన సాగిస్తున్నారన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి.
కానీ రాజకీయ నిర్ణయాల్లో మాత్రం ఇతర పార్టీలకు భిన్నంగా ఏమీ వ్యవహరించడం లేదని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. జాతీయ స్థాయిలో విపక్షాలన్నీ రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని నిలబెడతామని ప్రకటిస్తూ ఉంటే సీఎం కేసీఆర్ మాత్రం తామూ ఎన్డీయే, యూపీఏ కూటములలో లేమని చెప్పినా చివరకు ఎన్డీయేకే మద్దతని సూచన ప్రాయంగా తేల్చేశారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్ఎస్ ఇలా
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కారణమైన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన ప్రత్యర్థి. అదే సమయంలో 2014లో తెలంగాణ రాష్ట్ర కల సాకారం కావడానికి కారణం కాంగ్రెస్ పార్టీ అన్న సంగతి విస్మరిస్తున్నది టీఆర్ఎస్. నీతి ఆయోగ్ నుంచి నోట్ల రద్దు వరకు అన్నింటా ఆఖరుకు భూసేకరణ చట్టం - 2013 సవరణ బిల్లుకు కూడా కేంద్రం ప్రభుత్వానికి పార్లమెంట్లో అధికార పక్షానికి మద్దతు పలికింది టీఆర్ఎస్. కానీ రాజకీయంగా.. దేశ రాజకీయాలకు కీలకమైన, వ్యూహాత్మకమైన అంశం రాష్ట్రపతి ఎన్నికలు. ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం కావడానికి కీలకమైన రాష్ట్రపతి ఎన్నికల్లోనూ ఎన్డీయేకే మద్దతునిస్తున్నట్లు సీఎం కేసీఆర్ తన మనోగతాన్ని బయట పెట్టారు.
గవర్నర్ నరసింహన్తో భేటీలో కేసీఆర్ ఇలా
రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవమైనా, కాకపోయినా తమ మద్దతు ఎన్డీఏ అభ్యర్థికేనని సీఎం కేసీఆర్ తన మనసులో మాట రాష్ట్ర గవర్నర్ నరసింహన్కు సూచనప్రాయంగా తెలిపారు. సీఎం ఆదివారం రాజ్భవన్కు వెళ్లి గవర్నర్తో దాదాపు రెండు గంటల పాటు భేటీ అయ్యారు. రెండు రోజుల వ్యవధిలోనే గవర్నర్ను కేసీఆర్ రెండు సార్లు కలవటం ప్రాధాన్యం సంతరించుకున్నది.
లౌకిక అభ్యర్థి అయినా.. కాకున్నా ఇలాగే
గమ్మత్తేమిటంటే జాతీయ స్థాయిలో విపక్ష పార్టీగా టీఆర్ఎస్ను గుర్తించిన గత శుక్రవారం ఇతర ప్రతిపక్షాల నేతలతో సమావేశానికి కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ పంపిన ఆహ్వానాన్ని తిరస్కరించింది. తద్వారా తమ రాజకీయ భవిష్యత్ వ్యూహాన్ని బయట పెట్టింది. గవర్నర్ నరసింహన్తో జరిగిన సమావేశంలో ఎన్డీఏ లౌకిక అభ్యర్థిని నిలబెడితే ఏకగ్రీవానికి సహకరిస్తామని కాంగ్రెసే అంటున్నందున ఆ విషయం తేలేవరకూ అధికారికంగా ఎలాంటి ప్రకటనాచేసే ఆలోచన లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. గవర్నర్తో సీఎం భేటీలో ప్రస్తావనకు వచ్చిన అంశాలపై ఇటు ప్రభుత్వ, అటు అధికార టీఆర్ఎస్ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాకే టీఆర్ఎస్
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం శనివారం జరిగిన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ, లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో రాష్ట్రపతి ఎన్నికలపై తాము అనుసరించాల్సిన వ్యూహ నిర్ణయాన్ని పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్కే అప్పగించింది. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ ఆదివారం గవర్నర్తో భేటీ అయ్యారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే నిర్ణయం మనసులో తీసుకున్నప్పటికీ, ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక టీఆర్ఎస్ మద్దతు ఎవరికనేది అధికారికంగా ప్రకటన చేస్తామని చెప్పారు. ఇందుకు కారణాలను కూడా వివరించారు.
అయినా ఎన్డీయేకే టీఆర్ఎస్ సపోర్ట్
తాము ఎన్డీయేతోపాటు, యూపీఏ కూటమిలోనూ లేమని, అందుకే ఇటీవల యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాష్ట్రపతి ఎన్నికలపై ఢిల్లీలో నిర్వహించిన విందు సమావేశానికి తమకు ఆహ్వానం ఉన్నప్పటికీ వెళ్లలేదని చెప్పారు. ఎన్డీయే కూటమి రాష్ట్రపతి పదవికి లౌకిక అభ్యర్థిని పోటీకి దించితే ఏకగ్రీవ ఎన్నికకు సహకరించటానికి యూపీఏ కూడా సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తుండటాన్ని ప్రస్తావించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తేలకుండా, అసలు ఎన్నికల ప్రక్రియే మొదలు కాకుండా మద్దతుపై తాము ప్రకటన చేయటం సమంజసంగా ఉండదని తెలిపారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తమ మద్దతు ఎన్డీయే అభ్యర్థికే ఉంటుందని సీఎం పరోక్షంగా సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. దీనికి మరో కారణం కూడా ఉన్నదని తెలుస్తున్నది.
మైనారిటీల మద్దతుపై కేసీఆర్ ఇలా వ్యూహం
ఇప్పటికిప్పుడు రాష్ట్రపతి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎన్డీయేకు మద్దతుగా ఉన్నట్లు బహిరంగ ప్రకటనచేస్తే, మైనారిటీలను దూరం చేసుకోవాల్సిన దుస్థితి నెలకొంటుందని గులాబీ నాయకత్వంలో ఆందోళన ఉన్నట్లు తెలుస్తున్నది. సమయానుకూలంగా ఎన్డీయేకు మద్దతునిస్తున్నట్లు రాష్ట్రపతి ఎన్నికల సమయంలో ప్రకటిస్తే అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయమన్న సంకేతాలివ్వవచ్చునని టీఆర్ఎస్ వ్యూహంగా కనిపిస్తున్నది. అందుకే ముందస్తుగా తమ నిర్ణయాన్ని కేంద్రానికి తెలిపేందుకే గవర్నర్ నరసింహన్తో భేటీలో ఈ సంగతి చెప్పినట్లు సమాచారం.
యూపీ ఎన్నికల పరిస్థితి ఇదీ
కానీ పాతకాలం నాటి రోజులు మారిపోయాయన్న సంగతి విస్మరించొద్దు. ఇటీవల యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ - కాంగ్రెస్ పార్టీ కూటమి, బీఎస్పీ ముస్లింలకు పెద్ద పీట వేసినా ఫలితం దక్కలేదన్న సంగతి మరిచిపోవద్దని, దానికి మించి ముస్లింలకు రిజర్వేషన్ల అంశాన్ని బీజేపీ రాజకీయం చేస్తున్న సంగతి పరిగణనలోకి తీసుకోవాలని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.