'మద్యం తాగనని కెసిఆర్ ప్రతిజ్ఞ చేయాలి', 'ప్రభుత్వం ముందే కూలుతుంది'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తాను మద్యం మానుతున్నట్లు ప్రతిజ్ఞ చేసి ఇతరులకు మార్గదర్శకంగా నిలవాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ సోమవారం అన్నారు.
రాష్ట్ర శాసన సభ సభాపతి మధుసూదనాచారిని ఆదర్శంగా తీసుకొని ముఖ్యమంత్రి కెసిఆర్ సైతం నేను మానుతున్నా.. మీరు కూడా మానండి అంటూ ప్రతిజ్ఞ చేయించి ప్రజల్లో మద్య నిషేదం పైన అవగాహన కల్పించాలని సూచించారు.
కెసిఆర్ను గద్దె దించాలి
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకారుల, అమరులు ఆశయాలకు విరుద్ధంగా నిరంకుశ పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వాన్ని ప్రజలు గద్దె దించాలని అందుకు తెలంగాణ ఉద్యమ వేదిక (టియువి) ప్రజా పోరాటాలను సాగిస్తుందని టియువి రాష్ట్ర స్టీరింగ్ కమిటీ కన్వీనర్ డాక్టర్ చెరుకు సుధాకర్ అన్నారు.
సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని టౌన్హాల్లో జరిగిన టియువి ఆవిర్భావ సదస్సులో ఆయన మాట్లాడారు. సిఎం కెసిఆర్ పాలనపై నిప్పులు చెరిగారు.
తెలంగాణ ఉద్యమ వేదిక నిజమైన తెలంగాణ ఉద్యమకారులకు, సామాజిక తెలంగాణ కోరుకునే వారికి, టిఆర్ఎస్ మోసానికి గురైన వారికి సమర వేదికగా నిలుస్తుందన్నారు. ప్రతిపక్షమే లేదంటూ విర్రవీగుతున్న ప్రభుత్వాన్ని నిలదీసే బలమైన ప్రజాపక్షంగా టియువి ఎదుగుతుందన్నారు.
2019 ఎన్నికలకు ముందే కెసిఆర్ ప్రభుత్వం కూలుతుందని మధ్యంతర ఎన్నికలు తథ్యమని ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా టియువి రూపొందుతుందన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా దళితుడిని చేస్తానని చెప్పి మాట తప్పిన సిఎం కెసిఆర్ ఉద్యమకాలంలో ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలన్నీ విస్మరించాడన్నారు.
కాంగ్రెస్ ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ... కెసిఆర్ ప్రభుత్వం ఉద్యమకారులు ఆశించిన దానికి భిన్నంగా పాలన సాగిస్తుందన్నారు. రాష్ట్రం ఏర్పడి 14 నెలలైనా ప్రజల ఆకాంక్షలు నెరవేరకపోగా ప్రభుత్వం ఎన్నికల హామీలను తుంగలో తొక్కిందన్నారు.
నిరుద్యోగులు, మహిళలు, బడుగు, బలహీన వర్గాలు, దళితులను, రైతులను నిర్లక్ష్యం చేసిందని అంతా కలిసి ప్రభుత్వంపై తిరుగబడి ప్రజల ఆకాంక్షల సాధనకు కృషి చేద్దామన్నారు.