హరీశ్ బాగా హుషారు, సిద్దిపేట మొక్కను నేను: సిఎం కెసిఆర్
మెదక్: తాను సిద్ధిపేట నర్సరీలో మొలిచిన మొక్కను అని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అన్నారు. ఆనాడు మొలిచిన మొక్కను ఈనాడు యావత్ తెలంగాణకు నీడను ఇస్తున్నానని, ఇది ప్రజల వల్లే సాధ్యమైందని ఆయన వ్యాఖ్యానించారు. వజ్రాలు పెట్టినా సిద్దిపేట ప్రజల ప్రేమ దొరకదని అన్నారు. సిద్ధిపేటలో హరితహారం కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సభలో సిఎం కెసిఆర్ ప్రసంగించారు.
‘అందరికీ హరితహారం వందనాలు.. ఆకుపచ్చ దండాలు.. ప్రతి ఒక్కరూ హరితహారంలో పాల్గొనాలి. ఈ కాలం ఎండ కొట్టే కాలమా? వానలు పడే కాలం. మనం దారి తప్పినం. చెట్లు నాటాలని సీఎం చెప్పాలా. ఆంధ్రోళ్ల పాలనలో ఆగమైనం. ఇక ఈ కాలంలో ఎండలు పోవాలె.. వానలు రావాలె.. కోతులు వాపస్ పోవాలె. చెట్లు నాటితేనే వానలు వస్తాయి' అని ముఖ్యమంత్రి అన్నారు.
'కోతులు, కొండెంగలువాపస్ పోవాలంటే అడవుల విస్తీర్ణం పెంచాలి. అప్పుడే కోతులు, కోనెంగల వాపస్ సాధ్యమవుతుంది. ఇక ఇప్పుడు ఎవర్నీ అడుక్కునే పరిస్థితి లేదు.. వానలు రమ్మంటే రావాలి. కోతులు పొమ్మంటే పోవాలి. హరితహారం ఒక్కరితో విజయవంతం కాదు.. ప్రతి గ్రామంలోని ప్రతి వ్యక్తి హరితహారంలో పాల్గొంటేనే తెలంగాణ పచ్చగా తయారవుతుందన్నారు' సిఎం కెసిఆర్ అన్నారు.
ఇక్కడ మంత్రి హరీశ్ రావు బాగా హుషారుగా ఉన్నాడని అన్నారు. సిద్దిపేటలో మంచి నాయకత్వం ఉందని అన్నారు. మూడున్నర ఏళ్లల్లో గోదావరి నీళ్లతో సిద్దిపేట ప్రజల పాదాలు కడుగుతానని అన్నారు. కాళేశ్వరం పథకానికి ప్రారంభోత్సవానికి ఐదారు బస్సుల్లో వెళ్దామని చెప్పారు.
తెలంగాణ వస్తే కాళేశ్వరస్వామికి తన భార్య బంగారు కిరీటం చేయిస్తానని మొక్కుకుందని, ఆ కిరీటం ఆయనకు పెట్టి, మనం నీళ్లు తెచ్చుకుందామని అన్నారు. తన ఇంటి పైసలతోనే బంగారు కిరీటం చేయిస్తామని చెప్పారు. ఇక సిద్దిపేటకు రైలు రావాల్సి ఉందని, త్వరలోనే అది కూడా వస్తుందని చెప్పారు.
హరీశ్ రావును రైలు అడగమంటే.. విమానం రావాలంటాడని కెసిఆర్ చమత్కరించారు. సిద్దిపేటకు సమీపంలోని షామీర్ పేటలో మరో విమానాశ్రయం త్వరలోనే ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. జిల్లాకు మంచి మంత్రి, డిప్యూటీ స్పీకర్, కలెక్టర్ ఉన్నారని అన్నారు. సిద్దిపేటను జిల్లాగా చేస్తామని చెప్పారు.
వచ్చే రెండు మూడేళ్ల కరెంటు నిమిషం కూడా పోదని కెసిఆర్ అన్నారు. పది పన్నెండేళ్ల క్రితమే సిద్దిపేటలో మొక్కలు నాటామని, పది నిమిషాల్లో పదివేల చెట్లు నాటామని చెప్పారు. ఇక్కడి ప్రజలు 1500రోజులు తెలంగాణ కోసం దీక్ష చేశారని గుర్తు చేశారు. 100శాతం చెట్లను పెంచితే రూ. 5కోట్ల బహుమతి కూడా గెలుచుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. పద్మాదేవేందర్ రెడ్డి తమ నియోజకవర్గానికే రూ. 5కోట్లు తీసుకుపోతామన్నట్లుగా కోపంగా చూస్తున్నారని కెసిఆర్ అన్నారు.
హరితహారాన్ని విజయవంతం చేస్తాం: హరీష్రావు
తెలంగాణలో హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్రావు స్పష్టం చేశారు. సిద్ధిపేటలో సీఎం కేసీఆర్ మొక్కలు నాటిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభా ప్రాంగణంలో హరీష్ మాట్లాడారు. హరితహారమనేది మనకు కొత్తదేమీ కాదన్నారు. 1996లోనే కేసీఆర్ సిద్ధిపేటలో వేలాది మొక్కలు నాటారని గుర్తు చేశారు.
ఆనాడే మొక్కలు నాటి సిద్ధిపేటను సీఎం పచ్చగా చేశారన్నారు. సిద్ధిపేటకు తాగు నీరు అందించిన ఘనత సీఎం కేసీఆర్దే అని తెలిపారు. మెదక్ జిల్లాలో మూడున్నర కోట్ల మొక్కలు పెంచుతామని చెప్పారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు ఒక రోజు వేతనాన్ని హరితహారానికి విరాళంగా ఇచ్చారని ప్రకటించారు.